ఆఫర్ల వల
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:38 AM
మొబైల్ ఫోన్లో రకరకాల యాప్లు దర్శనమిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడి యా యాప్లు ఎన్నో ఉన్నాయి. ఈ యాప్లనే తమ ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు జిల్లా ప్రజ లపై వల వేస్తున్నారు.
ట్యాక్స్, కొరియర్ చార్జీలంటూ మరింత దోపిడీ..
అనంతరం మెసేజ్లకు నో రిప్లై..
లబోదిబోమంటున్న బాధితులు
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మొబైల్ ఫోన్లో రకరకాల యాప్లు దర్శనమిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడి యా యాప్లు ఎన్నో ఉన్నాయి. ఈ యాప్లనే తమ ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు జిల్లా ప్రజ లపై వల వేస్తున్నారు. ఏ పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా సైబర్ నేరగాళ్లు ఒక మెస్సేజ్ పంపిస్తున్నారు. ఆ మెస్సేజ్ ఓపెన్ చేశారంటే ఫోన్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి సొమ్ము గల్లంతే. ఇప్పటి వరకూ ఏపీకే ఫైల్స్తో ప్రమాదమని భావించారు. నేడు ఎక్స్వైజడ్ ఫైల్స్ కూడా ప్రమాద మేనని గుర్తించారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లు చూస్తున్నప్పుడు వివిధ నగరాల్లో ఉన్న రకరకాల షాపింగ్ మాల్స్ పేరుతో పండుగ ఆఫర్లు అంటూ మరీ వీడియోలు చూపించి తక్కువ ధరకే ఇస్తున్నామంటూ ఈ నంబర్ వాట్సాప్ ద్వారా కాంటా క్టు అయితే కొరియర్ ద్వారా వస్తువులు పంపిస్తున్నా మంటూ చెప్పుకొస్తున్నారు. వాటిని నమ్మిన ఎందరో సొమ్ము చెల్లిస్తున్నారు. ఆ విధంగా రూ. 100 నుంచి రూ. 10 వేల వరకూ కట్టించుకుని అవి పం పాలం టే టాక్స్ కట్టాలంటూ మళ్లీ డబ్బులు వేయమని అంటున్నారు. ఒక వేళ మళ్ళీ డబ్బులు వేసినా కొరి యర్ ఛార్జీలు అంటూ మరో రెండు వేలు కట్టాలని చెబుతూ సొమ్ము వేసిన తరువాత మెస్సేజ్లకు ఎలాంటి రిప్లై ఇవ్కపోవడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. పది వేల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు ఎందరో ఉన్నారు. పోలీస్ స్టేషన్కు వెళితే సైబర్ సెల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఏలూరు నగరంలోని సైబర్ సెల్కు రాలేక బాఽధితులు మిన్నకుండి పోతున్నారు. అంతేకాక పండుగల పేరు తో ఆఫర్లు అంటూ రీల్స్లో చూపిస్తూ 90 పర్సంట్ ఆఫర్ అంటూ చెప్పడం, తరువాత ఈ–కామర్స్లో పేరు పొందిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి వాటి పేర్లుతోనే మెస్సేజ్లు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. వీటిని నమ్మి సొమ్ము చెల్లించిన వారు లబోదిబో మంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి బాధితు లు కనీసం 20 వేల మందిపైనే ఉన్నట్లుగా భావిస్తు న్నారు. సుమారు రూ. 2 కోట్ల మేర సైబర్ నేరగాళ్ళు దోచేశారు. ముఖ్యంగా లింకులు పంపి ఫోన్లను హ్యాక్ చేసి ఫోన్ను పూర్తిగా సైబర్ నేరగాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఆ ఫోన్లో ఉన్న కాంటాక్టు వాట్సాప్లకు మెస్సేజ్లు పెడుతూ సొమ్ములను ఇవ్వాలని పంపిస్తు న్నారు. ఈ విధంగా ఎంతో మంది బాధితులు బల య్యారు. జిల్లాలో చదువులేని వారే కాదు చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్ళ బారినపడుతూనే ఉన్నారు. పోలీసులు అవగా హన కల్పిస్తున్నప్పటికీ ఫోను పట్టుకుని వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో వచ్చిన లింకులను యాథాలాపంగా ఆ లింకులపై క్లిక్ చేయడంతో వెంటనే వారి ఫోన్లు హ్యాక్ అయిపోతు న్నాయి. చివరకు తక్కువ సొమ్ము పోవడంతో ఫిర్యాదులు చేయలేక మిన్నకుండిపోతున్నారు.
ఏలూరునకు చెందిన ఒక వైద్యురాలి ఫోనుకు వచ్చి న ఏపీకే ఫైల్ లింకు ఓపెన్ చేయడంతో వెంటనే ఆమె ఫోన్ హ్యాక్ అయింది. ఆమె కాంటాక్టులో ఉన్న వాట్సాప్ నంబర్లకు ‘అత్యవసరంగా రూ. 20 వేలు పంపండి నేను తరువాత ఇస్తా’నని మెస్సేజ్ లు పెట్టడంతో ఆ వైద్యురాలిపై ఉన్న గౌరవంతో క్షణాల్లో 3 లక్షలు పైగా సైబర్ నేరగాళ్ళు స్వాహా చేశారు. చివరకు బాధితురాలు తన ఫోన్ను స్విచ్ ఆపివేసి సిమ్ బయటకు తీసి మరో ఫోన్లో ఆ సిమ్ వేసి వాట్సాప్ను యాక్టివ్ చేయడంతో సైబర్ నేరగాళ్ళ కంట్రోల్ నుంచి ఆ ఫోన్ లింకు బయటపడింది.
ఏలూరుకు చెందిన ఒక మహిళ చెన్నైకు చెందిన డీఎస్ఆర్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి పేమెంట్లు చేశారు. మూడు వేల రూపాయల శారీ భారీ డిస్కౌంట్ అంటూ రూ. 598కే ఇస్తున్నా మని ఉండడంతో నమ్మి సొమ్ము చెల్లించారు. చివరకు అది మోసం అని గ్రహించారు. ఫిర్యాదు చేయలేక తన కుటుంబ సభ్యులకు, తన భర్తకు తెలిస్తే ఏమంటారోనని మిన్నకుండిపోయారు.
హస్త సాముద్రిక యాప్ మీ జ్యోతిష్యం చెప్తుందంటూ వాట్సాప్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ ఏపీకే ఫైల్స్ పెడుతున్నారు. వీటిని క్లిక్ చేశారంటే ఆ ఫోను మొత్తం హ్యాక్ అయిపోతుంది. ఇలాంటి వాటిలో కూడా బాధితులు చిక్కుకుంటున్నారు. అయితే పోయిన సొమ్ము తక్కువ కావడంతో ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావడం లేదు.