21మంది వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:38 PM
సకాలానికి విధులకు హాజరుకావడంలో విఫలమవుతున్న 21 మంది పీహెచ్సీలు, యూహెచ్సీల వైద్యాధికారులకు డీఎంహెచ్వో డాక్టర్ శోభ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): సకాలానికి విధులకు హాజరుకావడంలో విఫలమవుతున్న 21 మంది పీహెచ్సీలు, యూహెచ్సీల వైద్యాధికారులకు డీఎంహెచ్వో డాక్టర్ శోభ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఉదయం షిఫ్ట్లో 9 గంటలకు విధుల కు హాజరుకావాల్సిన మెడికల్ ఆఫీసర్లు రెండు గంటలు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్టు శుక్రవారం ధ్రువ పడటంతో వారికి తాఖీదులు ఇవ్వాలని నిర్ణయించారు. వాస్త వానికి వైద్యఆరోగ్యశాఖలో వైద్యాధికారులు, పీహెచ్సీలు, యూహెచ్సీల్లో పనిచేసే వివిధ కేడర్ల సిబ్బందిలో పలువురు సకాలంలో విధులకు హాజరైనట్టుగా ముఖగుర్తింపు ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్) నమోదు చేయడం లేదని ఇటీవల గుర్తించి, కొద్దిరోజులక్రితం సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శుక్రవారం మెడికల్ ఆఫీసర్లకు నోటీసులు జారీచేసి, 48 గంటల్లోగా వివరణలను డీఎంహెచ్వో కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఇలా షోకాజ్ నోటీసులు జారీ అయినవారిలో మండవల్లి, దేవపూడి, తడికలపూడి, ధర్మాజీగూడెం, చేబ్రోలు, కోండ్రుకోట, గురజ, వింజరం, చాటపర్రు, నూజివీడు, ఎల్ఎన్డీ పేట, తాడువాయి, ఎర్రగుంటపల్లి, డాంగేనగర్ (జంగారెడ్డిగూడెం), పవర్పేట (ఏలూరు), లింగపాలెం, తడికలపూడి, మూలలంక, రమణక్కపేట, ముసునూరు పీహెచ్సీలు, యూహెచ్సీల వైద్యాధికారులున్నారు. జిల్లాలో 62 పీహెచ్సీలు, 14 యూహెచ్సీలున్నాయి.