దేవస్థానం తప్పిదం లేదు..
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:34 AM
‘చినవెంకన్ననూ వదల్లేదు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం వచ్చిన కథనానికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు స్పందిం చారు.
చినవెంకన్న ఆలయ చైర్మన్ సుధాకరరావు స్పష్టీకరణ
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 13(ఆంధ్ర జ్యోతి): ‘చినవెంకన్ననూ వదల్లేదు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం వచ్చిన కథనానికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు స్పందిం చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రక టన విడుదల చేశారు. అందులో ఏం పేర్కొ న్నారంటే..
‘గతంలో ఆలయంలో ప్రభుత్వ ఆమోదం పొందిన కో–ఆపరేటివ్ డెయిరీలలో (విజయ, సంగం) నెయ్యి మాత్రమే కోటేషన్ పద్ధతిన వినియోగించేవాళ్లం. అనంతరం 2022, ఏప్రిల్ 25న దేవదాయశాఖ, కమిషనర్ కార్యాలయ మెమో ద్వారా టెండరు పద్ధతిన తక్కువ టెండరుదారుడికి నెయ్యి సరఫరా అవకాశంపై ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో తక్కువ టెండరు దారు వినాయక ఏజన్సీస్ (శ్రీవైష్ణవిడెయిరీ) నుంచి దేవస్థానం నెయ్యి కొనుగోలు చేసింది. ఏ ఉద్దేశ్యంతో ఈ పద్ధతి అమలు చేశారో అది వారికే తెలియాలి. టెండరుదారు సప్లై చేసే నెయ్యిని జాతీయ సంస్థ అయిన ఎన్ఏబీటీసీ ఎల్ వారిచే ఆమోదం పొందిన విజయవాడ అక్యురేట్ ల్యాబ్ క్యాలిటీ చెక్ చేసి స్వచ్ఛమైన దని సర్టిఫై చేసిన తర్వాతే వినియోగిస్తాం. ఆ సమయంలో ఎవరి వద్ద నుంచి ఏవిధమైన అభియోగాలు రాలేదు. తర్వాత ట్రస్ట్బోర్డు ఆమోదంతో శాఖ కమిషనర్ వద్ద ఉత్తర్వులు పొంది అతిపెద్ద కో–ఆపరేటివ్ డెయిరీ సంగం వారి వద్ద నుంచి గతంలో మాదిరిగా టెండర్ పద్ధతిన కొనుగోలు చేస్తున్నాం. భక్తులకు సౌకర్యాల కల్పన, పరిశుభ్రత విషయంలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏపీ డాష్బోర్డులో రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఒకసారి రెండోస్థానం, ప్రస్తుతం ప్రఽథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ భక్తుడే భగవంతుడు.. అన్ని సౌకర్యాలను భక్తుల మనోభావాల ప్రకారం చేయడం ఆనవాయితీ. దాతలు, భక్తులు గమనించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే అసలు నెయ్యి సరఫరాలో గతంలో ఉన్న రూల్స్ను ఎందుకు మార్చారు.? ఆ రూల్స్నే దేవాలయం అనుసరించాల్సి వచ్చింది. ఇందులో దేవస్థానం తప్పిదం ఏమీలేదు. భక్తులు, దాతల సహకారంతో నడుస్తున్న ఇటువంటి దేవస్థానాల్లో ఏ గోప్యత ఉండదు. ఎవరైనా ఈవో సమక్షంలో పరిశీలన చేసి తెలుసుకోవచ్చ’ని వివరించారు.