ఏం జరిగింది..?
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:28 AM
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా అనుమతి సాధించిన జాతీయ రహదారుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పెడన నుంచి ఏలూరు జిల్లాలోని నూజివీడు మీదుగా కృష్ణా జిల్లాలోని లక్ష్మీపురం వరకు 120.85 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి నంబర్ 216–హెచ్ ఒకటి.
నెల రోజుల కిందట పనుల నిలిపివేత
విశాఖకు రహదారి విస్తరణ కార్యాలయం తరలింపు
ముగ్గురు ఎంపీల దృష్టికి తీసుకెళ్లిన ఆయా నియోజకవర్గ ప్రజలు
నూజివీడు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా అనుమతి సాధించిన జాతీయ రహదారుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పెడన నుంచి ఏలూరు జిల్లాలోని నూజివీడు మీదుగా కృష్ణా జిల్లాలోని లక్ష్మీపురం వరకు 120.85 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి నంబర్ 216–హెచ్ ఒకటి. 2021 వరకు రాష్ట్ర హైవేగా ఉన్న ఈ రహదారిని 2021 సెప్టెంబరు నుంచి జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి 216–హెచ్ నంబర్ను కేటాయించింది. వెంటనే ఆ ఏడాది నవంబరు నుంచి ఈ రహదారి విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. మూడు ఫేజ్ల్లో విస్తరించడానికి ప్రణాళిక లు రూపొందించారు. మొదటి ఫేజ్ పెడన–గుడి వాడ వరకు 33 కిలోమీటర్లు, రెండో ఫేజ్లో జనార్ధనపురం–నూజివీడు వరకు 45 కిలోమీటర్లు, మూడో ఫేజ్లో నూజివీడు–లక్ష్మీపురం వరకు 42 కిలోమీటర్లు విస్తరణ చేపట్టడానికి నిర్ణయించారు. మొదటి ఫేజ్లో దాదాపు పనులు పూర్తిగా గాక రెండో ఫేజ్లోను పనులు ప్రారంభమయ్యాయి. మూడో ఫేజ్లో భూసేకరణకు సర్వే పూర్తయింది. ఈ దశలో ఏమైందో ఏమో కాని నెల రోజుల కిం దట పనులు ఆగిపోయాయి. దీనికి కారణం విస్త రణ పనులకు కేంద్ర ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చి నట్టు సమాచారం. మచిలీపట్నంలో ఉన్న ఈ రహదారి విస్తరణ కార్యాలయం విశాఖకు తర లించారు.
విస్తరణ వల్ల ప్రయోజనాలు
ఈ రహదారి విస్తరణకు రూ.1,200 నుంచి రూ.1,800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ రహదారి వెడల్పు పది మీటర్లుగా ఉంది. దానిని విస్తరణలో 45 మీటర్లకు పెంచనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం మరో 25 మీటర్ల భూసేకరణ చేస్తున్నారు. విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి నెం బరు 30కి, అలాగే కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారులకు ఈ రహదారి అనుసంధానం అవు తుంది. పోర్టులు లేని ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ రహదారి ద్వారా మచిలీపట్నం పోర్టుకు లింక్ ఏర్పడి వారి రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతుంది. నూజివీడు–హనుమాన్ జం క్షన్ల మధ్య ఉన్న మల్లవల్లి ఇండస్ర్టియల్ ఎస్టేట్ పక్క నుంచి ఈ జాతీయ రహదారి వెళ్ళడం వల్ల పారిశ్రామిక అవసరాలకు, రవాణా అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇప్పుడు తాజా గా నూజివీడు చింతలపూడి నియోజకవర్గాలలో కోల్ బెల్డును కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్తులో బొగ్గు రవాణాకి ఈ రహదారి కీలకం కానుంది.
ఎంపీలకూ సమాచారం లేదు..
ఈ జాతీయ రహదారి మూడు జిల్లాల మీదుగా వెళుతుంది. దీని పరిధిలో మూడు జిల్లాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారికి కూడా విస్తరణ పనులు నిలిపివేస్తున్న విషయం కేంద్రం నుంచి సమాచారం లేదు.ఈ రహదారి పరిధిలో మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, పుట్టా మహేష్కుమార్, కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ రహదారి ప్రాధాన్యతను వివరించి ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఎలాంటి వర్తమానం లేదని కేంద్ర మంత్రి గట్కరీ, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీనిపై ఏలూరు ఎంపీ ఇప్పటికే కేంద్ర మంత్రి జాతీయ రహదారుల శాఖ మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.