Share News

నరసా‘పూర్‌’ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:29 AM

జిల్లాలో నరసాపురం ఎక్స్‌ప్రెస్‌కు ఎంతో చరిత్ర ఉంది. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు ప్రత్యేక అనుబంధం కూడా. ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్‌ ప్రయాణం అంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌.

నరసా‘పూర్‌’ ఎక్స్‌ప్రెస్‌

రైలుకు 56 ఏళ్ల చరిత్ర

పాత కోచ్‌లతోనే ప్రయాణం

సీట్లు, సౌకర్యాలు అంతంతమాత్రం

రద్దీగా ఉన్నా పట్టించుకోని అధికారులు

జిల్లాలో నరసాపురం ఎక్స్‌ప్రెస్‌కు ఎంతో చరిత్ర ఉంది. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు ప్రత్యేక అనుబంధం కూడా. ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్‌ ప్రయాణం అంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు 1970లో పట్టాలెక్కింది. 56ఏళ్లుగా హైదరాబాద్‌ ప్రయాణికులకు ప్రధాన రవాణా సౌకర్యం. కోనసీమ, కృష్ణా జిల్లాల వారు హైదరాబాద్‌ వెళ్లడానికి ఈ రైలునే ఎంచుకుంటారు. ఈ రైలు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. టిక్కెట్లు దొరకడం గగనం. పలు రైళ్లలో సౌకర్యాలు మెరుగు పరుస్తున్నారు. నరసాపురం ఎక్స్‌ప్రెస్‌లో అంతంతమాత్రం..!

నరసాపురం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఎన్ని రైళ్లు నడుస్తున్నా నరసా పురం ఎక్స్‌ప్రెస్‌ డిమాండ్‌ తగ్గడం లేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 24 కోచ్‌లతో నడిచే 5 ప్రధాన రైళ్లలో నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ ఒకటి. నిత్యం వేలాది మంది ఈ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. రైలులో హైదరాబాద్‌కు మత్ససంపద ఎగుమతులు కూడా ఎక్కువే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే చిన్నచూపు చూసింది. ఇటీవల చాలా రైళ్లను ఆధునిక సౌకర్యాలతో కూడిన ఎల్‌ హెచ్‌పి కోచ్‌లుగా మార్చింది. అందులో జిల్లా నుంచి వెళ్లే శేషాద్రి, పూరి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ముందు నుంచి నడుస్తున్న నరసాపురం ఎక్స్‌ప్రెక్స్‌ను మాత్రం నిర్లక్ష్యం చేసింది. ఐసీఎఫ్‌ కోచ్‌లతో నడుస్తు న్న ఈ రైలులో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందు బాటులోకి రాలేదు. ఐసీఎఫ్‌ కోచ్‌లలో బెర్త్‌లు హార్డ్‌. సస్పెన్షన్‌ తక్కువ కావడంతో ప్రయాణంలో జర్క్‌లు ఎక్కువ. స్లీపర్‌ కోచ్‌లో కేవలం 72 బెర్త్‌లు ఉంటా యి. ఏసీ త్రీటైర్‌లో 64 ఉంటాయి. మెరుగైన సౌక ర్యాలున్న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో ప్రయాణం సురక్షితం. స్పీడ్‌ 160 వరకు ఉంటుంది. భోగీల్లో 80బెర్త్‌లు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో కూడా 72బెర్త్‌లు ఉంటాయి.

రద్దీకి అనుగుణంగా సీట్లు లేవు..

ప్రస్తుతం నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ (లింగంపల్లి)లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సీట్లు పెంచలేదు. ఐసీఎఫ్‌ నుంచి ఎల్‌హెచ్‌బీ భోగీలుగా మారిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి కోచ్‌లో అదనంగా ఎనిమిది సీట్ల రిజర్వేషన్‌ పొందే అవకాశం ఉంది. ఏసీ కోచ్‌లతో కలిపి 240 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఎక్కువ మంది రిజర్వేషన్‌ పొందే అవకాశం ఉంటుంది. వీటిన్నంటినితో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దక్షిణ మధ్య రైల్వే మాత్రం పాత కోచ్‌లతోనే నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రైళ్లను మార్చి ఈ రైలును మాత్రం ఎందుకు ఎల్‌హెచ్‌పీగా అప్‌గ్రేడ్‌ చేయడం లేదన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 13 , 2026 | 12:29 AM