మునిసిపల్ హీట్
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:38 AM
మునిసిపల్ ఎన్ని కలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. అయినప్పటికీ నరసాపురం పట్టణ పరిధిలో రాజ కీయం క్రమక్రమంగా వేడేక్కుతోంది.
నరసాపురంలో ఎన్నికల సంగ్రామానికి సై
కూటమి జోరు.. వార్డుకు నలుగురైదుగురు ఆశావహులు
వైసీపీ బేజారు.. అభ్యర్థుల కోసం వెతుకులాట
నరసాపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):మునిసిపల్ ఎన్ని కలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. అయినప్పటికీ నరసాపురం పట్టణ పరిధిలో రాజ కీయం క్రమక్రమంగా వేడేక్కుతోంది. కూటమి తరుపున పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతుంటే వైసీపీలో ఆ జోష్ కనిపించడం లేదు. కొన్ని వార్డుల్లో సరైన అభ్యర్థులు లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలు అన్వేషణలో పడ్డారు. ‘ఎక్కడా ఏకగ్రీ వం కానివ్వం.. అన్ని వార్డుల్లో పోటీ చేసి కూటమికి గట్టి పోటీ ఇస్తామ’ని వైసీపీ నేతలు చెప్పినప్పటికీ ఆ దిశగా అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి సవాల్గా మారింది. పురపాలక పరిధిలో గతంలో 31 వార్డులు ఉన్నాయి. కొత్తగా ఐదు వార్డులు పెరగడంతో 36కు పెరిగింది. గత ఎన్నికల్లో అన్ని వార్డుల్లో గట్టి పోటీనిచ్చింది. జనసేన నాలుగు, టీడీపీ ఒకటి, రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ఒకరు వైసీపీ కండువా కప్పుకంటే. ఏడో వార్డు నుంచి గెలుపొందిన కోటిపల్లి సురేష్ చివరి వరకు ఇండిపెండెంట్గా కొనసాగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఇద్దరు వైసీపీ నాయకులు కూటమి కండువాలు కప్పుకున్నారు. ప్రస్తు తం మాజీలలో నలుగురైదురు మినహా ఎవరూ పోటీ చేసేం దుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. వీరు కూడా రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీలో ఉంటామని చెప్పుతున్నారు. పక్క వార్డులోకి వెళ్లి పోటీలో దిగమని అధినాయకులకు చెప్పినట్లు సమాచారం. ఇక కొత్తగా ఏర్పడిన వార్డులతోపాటు పాత వార్డుల్లోనూ బలమైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ నేతలు అన్వేషించాల్సిన పరిస్థితి. మరికొందరు రిజర్వేషన్ ఖరారైన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని దాటవేస్తున్నారు. దీంతో అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలో నిలపడం కత్తి మీద సాములా మారింది.
చైర్మన్ పదవిపై ఉత్కంఠ
చైర్మన్ పదవి ఉత్కంఠగా మారింది. ఓసీ అయితే ఎవరు నిలబడతారన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఇద్దరు, ముగ్గురు సీనియర్లు మాత్రం ముదునూరి తనయుడు బరిలో దిగే ఛాన్స్ ఉందని చెపుతున్నారు. ఇదే క్రమంలో ఓ ఆక్వా రైతు పేరు వినిపిస్తున్నది. ఇటీవల కాలంలో ఇతనికి ఆక్వాలో బాగా కలిసి రావడంతో వైసీపీ అతడిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ వీరిద్దరూ కాకపోతే ఓసీ నుంచి ఇద్దరు మాజీల పేర్లు పరిగణనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. వీరిలో గతంలో చైర్పర్సన్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థి ఒకరు. మరొకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ పేరు వినిపిస్తున్నది. పురపాలకంతోపాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.