అవసరానికి మించి..
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:03 AM
జిల్లాలో డీజిల్ కొరత ఐదో రోజు సోమవారం కూడా కొనసాగింది. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కంటిన్యూ అవుతున్నాయి. అన్ని బంకు ల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా భారీ క్యూలైన్లు కనిపించాయి.
కావాల్సిన వారికి కష్టాలు.. బంకుల వద్ద పడిగాపులు
ఐదో రోజూ తప్పని భారీ క్యూలైన్లు.. సరఫరాలో పరిమిత కోటా
ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు దిశా నిర్దేశం
క్షేత్ర స్థాయిలో కలెక్టర్, ఎస్పీ పర్యటన
వ్యవసాయం, ఆక్వా రైతులకు కూపన్లు
ఏలూరు సిటీ/క్రైం/రూరల్/పెదవేగి/భీమవరం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి):జిల్లాలో డీజిల్ కొరత ఐదో రోజు సోమవారం కూడా కొనసాగింది. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కంటిన్యూ అవుతున్నాయి. అన్ని బంకు ల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా భారీ క్యూలైన్లు కనిపించాయి. డీజిల్ కొరతపై జనంలోనూ అపోహ లు పెరిగిపోయాయి. ఫలితంగా నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది క్యాన్లలో భర్తీ చేసుకుని బ్లాక్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులపై సిఫారసుల ఒత్తిడి పెరుగుతోంది. ఆక్వా రైతులు, వరి రైతులకు కూపన్ల ద్వారా సరఫరా చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుం ది. అదే ఇప్పుడు కొన్ని బంకులకు ఇబ్బందిగా మా రింది. డీజిల్ పక్కాగా ఉంటుందన్న బంకులకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల తమ ఖాతాదారులకు డీజిల్ ఇవ్వలేకపోతున్నామంటూ యజమానులు గగ్గో లు పెడుతున్నారు. భవిష్యత్తులో వ్యాపారం దెబ్బ తిం టుందని యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడే పరిస్థితులు దుర్భరంగా మారాయి. పెట్రోలు, డీజిల్కు కొరత లేదని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. 232 బంకుల ద్వారా రోజువారీ వినియోగం డీజిల్ 3.65 లక్షల లీటర్లు, పెట్రోలు 2.60 లక్షల లీటర్లు. కొద్దిపాటి తేడాతో సరఫరా అవుతున్నా.. ప్రజలు అవసరాలకు మించి కొనుగోళ్లు చేయ డంతో వచ్చిన స్టాక్ వచ్చినట్లే అయి పోతోందని బంకుల యజమానులు చెబుతున్నారు. పెట్రోలుకు కొరత లేక పోయినా వాహనదారులు ఫుల్ ట్యాం కు చేయించుకోవటం, క్యాన్లలో తీసు కువెళుతుండటంతో ఈ నిల్వలు అయి పోతున్నాయి. వారం రోజులుగా 20 శాతా నికిపైగా అధికంగా కొనుగోళ్లు పెరిగాయి. ధాన్యం కోతలు, కొనుగోళ్లు, ఆక్వా చెరువులు, పరిశ్రమల అవసరాలకు డీజిల్ అందుబాటులో లేక ఆయా రంగాలు కుదేలవుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో బైక్లకు పెట్రోలు రూ.100, రూ.200, కార్లు, వ్యాన్లకు డీజిల్ రూ.1000, రూ.1500 మించి కొట్టడం లేదు. ఆటోల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్రావెల్స్ బస్సులు, కార్లు ధరలు పెంచేశారు.
ధర పెంపుపై అనుమానాలు
ఓ వైపు డీజిల్ లభ్యం కాదని, మరోవైపు ధరలు పెరిగిపోతాయంటూ కొందరు వాహన యజమానులు అనుమానాలతో నిల్వ చేసుకుంటున్నారు. ఇది డిమాండ్ పెంచుతోంది. వాస్తవానికి ఇండస్ర్టియల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం రూ.20 ధర పెంచింది. ఆ వినియోగం ఎలా ఉందనేది ప్రభుత్వ స్థాయిలో పర్యవేక్షించాలి. కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాలి. కంపెనీల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే వారంతా ఇప్పుడు తగ్గించేశారు. జిల్లాలోనూ పరిశ్రమల వారీగా వినియోగంపై ఆరా తీయాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్కు అవసరమైన డీజిల్ అధిక ధరలకు కొనుగోలు చేయాలి. కానీ అక్కడంతా బంకుల నుంచే తీసుకోవడం డిమాండ్కు ఒక కారణం. ఇటువంటి వాటిపై దృష్టి పెడితేనే కొరత నివారణ సాధ్యమవు తుంది. కంపెనీలు అవసరమైన డీజిల్ను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. లేదా అవసరమైన మేరకు బంకులకు డీజిల్ సరఫరా చేయాలి. అప్పుడు పరిశ్రమలకు అవసరమయ్యే డీజిల్ విషయంలో దృష్టి పెట్టకపోతే ఇటువంటి ఇబ్బందులే ఎదురుకానున్నాయి. ఇంధన కంపెనీలు బంకులకు కోత పెట్టనున్నాయి. జిల్లాకు అవసరమైన డీజిల్ను సరఫరా చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొంది. ట్యాంకర్ల కొరతతో కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇది ప్రస్తుతం సమస్యగా మారింది. వాస్తవానికి ఒక్కరోజు వ్యవధిలో డీజిల్ కొరత తీరిపోనుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. కంపెనీల నుంచి అనుకున్నట్టుగా జిల్లాకు సరఫరా లేకపోవడంతో సోమవారం కూడా డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. బ్లాక్లో విక్ర యించు కోవడానికి కొందరు దళారుల అవతార మెత్తారు.
అందరికీ డీజిల్.. పెట్రోలు
పెదవేగి మండలంలో డీజిల్, పెట్రోల్ లేక 48 గంటలపాటు మూతబడిన బంకులు తెరుచుకున్నాయి. శనివారం సాయంత్రం మూతపడిన పెదవేగి ఇండి యన్ ఆయిల్ బంకుకు సోమవారం సాయంత్రానికి రెండు ట్యాంకర్లలో పెట్రోల్, డీజిల్ రావడంతో జనం బంకుకు క్యూ కట్టారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని యజమాని శ్రీరామ్మూర్తి వాహన దారులకు డీజిల్ రూ.2 వేలు, పెట్రోల్ రూ.200 లిమిట్ పెట్టి, వాహనదారులకు అందిస్తున్నారు. పెట్రోల్ కోసం బైక్లు, డీజిల్ కోసం ట్రాక్టర్ యజమానులు బారులు తీరారు.