మావుళ్లమ్మ.. మా బంగారు తల్లి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:47 AM
భీమవరం మావుళ్లమ్మకు రూ.35 కోట్ల విలువైన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారు చేసి విజయదశమి నాటికి అలంకరించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) తెలిపారు.
23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు.. దసరాకు అలంకారం
భీమవరం టౌన్, జూలై 27(ఆంధ్రజ్యోతి): భీమవరం మావుళ్లమ్మకు రూ.35 కోట్ల విలువైన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారు చేసి విజయదశమి నాటికి అలంకరించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) తెలిపారు. మావుళ్లమ్మకు ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన బంగారాన్ని సోమవారం ఎమ్మెల్యే, దేవదాయ శాఖ అధికారులు, దేవస్థా నం సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులకు అందించి విలేకరులతో మాట్లాడారు. అమ్మ వారికి త్వరలోనే వంద కేజీల బంగారంతో రూ.150 కోట్ల విలువైన సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయిస్తాం. ఇప్పటి వరకు 50 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 23 కేజీలతో పలు ఆభరణాలు తయారు చేయిస్తున్నాం. మరో 30 కేజీల వరకు కావాల్సి ఉంది. దాతలు భక్తుల సహకారంతో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తిచేస్తా’మని తెలిపారు.
దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు, జేఈవో పల్లంరాజు, అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్యప్రకాశ్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ అమ్మ వారికి మూడు వేల మంది భక్తులు 23 కేజీల మూడు గ్రాముల బంగారం భక్తులు సమర్పిం చారని తెలిపారు. బంగారాన్ని స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులు రమేష్కుమార్ అగర్వాల్, కాగిత వెంకటరమణ, సంగడి బుజ్జి, గొంట్లవెంకట నారాయణలకు ఎమ్మెల్యే అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగేశ్వరరావు, ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, పాలక వర్గ సభ్యులు, ఆయా దేవాలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.