కన్నుల పండువగా మావుళ్లమ్మ జాతర
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:43 AM
మండలంలోని సిద్దాంతం గ్రామ దేవత మావుళ్లమ్మ జాతర మహోత్సవాలు సోమవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు.
ఆకట్టుకున్న గరగల నృత్యాలు, వేషధారణలు
వాసవి పెనుగొండ, జూలై 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని సిద్దాంతం గ్రామ దేవత మావుళ్లమ్మ జాతర మహోత్సవాలు సోమవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. మావుళ్లమ్మ ఫ్రెండ్స్ యూనియన్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతరకు గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా చంటి పిల్లలు కాగడాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ సన్నాయి మేళాలు, గరగల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం తెల్లవారుజామున వరకు కొనసాగి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేపట్టారు. జాతరలో భాగంగా తీర్థమహోత్సవం ముగిసిన మూడు రోజులు అనంతరం ఈనెల 18న ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.