శాశ్వత నిద్రలోకి..
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:42 AM
తెలంగాణలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏలూరు, పశ్చిమ గోదా వరి జిల్లాలకు చెందిన ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కోదాడ బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి.. 14 మందికి గాయాలు
మృతుల్లో ఒకరు భీమవరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
క్షతగాత్రుల్లో నలుగురు పశ్చిమ, ఏలూరు జిల్లాలవాసులే
ఏలూరు క్రైం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏలూరు, పశ్చిమ గోదా వరి జిల్లాలకు చెందిన ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 25వ తేదీ రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఏలూరు వరకు మాత్రమే ఈ బస్సు రావడంతో ఏలూరు లో దిగేవారు ఆ బస్సులో 26 మంది ఉన్నారు. బస్సు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగి వున్న కంటైనర్ లారీని బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమా దం సంభవించింది. ఆరుగురు మరణిం చగా వారిలో భీమవరం మెంటేవారితోటకు చెందిన సురావరపు షకీనా(24) వున్నారు. ఆమె విజయ వాడ ఆటోనగర్లో నివసిస్తున్నారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరో కంపెనీకి మారేందుకు ఇంటర్వ్యూకు వెళ్లి హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై మరణిం చింది. ఈ ప్రమాదంలో 14 మంది క్షతగాత్రులు కాగా వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవాని(45), ఏలూరుకు చెందిన ప్రైవేటు ఉద్యోగిని బండి చందన(25), సైలా అనిల్ కుమార్(25), దెందులూరుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆకుల నవీన్ కుమార్(18) తీవ్రంగా గాయపడ్డారు. చందన విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏలూరు వస్తున్న బస్సు మార్గమధ్యలో ప్రమాదాన్ని గురైందని తెలియడంతో జిల్లాలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న తమ బంధువులు ఎలా ఉన్నారు? అంటూ జిల్లాలోని వారి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళ నకు గురయ్యారు. తమ బంధువుల సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండడం, కొన్ని ఫోన్లు ఎత్తకపోవ డంతో మరింత ఆందోళనకు గురైయ్యారు. అయితే ప్రమాద సమాచారం అందిన వెంటనే ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూర్యాపేట ఎస్పీతో మాట్లాడి ప్రమాద పరిస్థి తులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల వివరాలు, మర ణించిన వారి వివరాలను మీడియాకు, బస్సు లోని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లావాసులకు అవసరమైన సహాయం అందిం చాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మరోవైపు జాతీయ రహదారిపై ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పెట్రోలింగ్ సిబ్బందిని ఆదేశించారు.
రోడ్డుపైనే వాహనాల నిలిపివేత
ఇటీవల ఏలూరు సమీపంలోని జాతీయ రహదారి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ఎదు రుగా ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగి ఉండడంతో వెనుక నుంచి వస్తున్న మరో కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు వెనుక భాగాలు దెబ్బ తిన్నాయి. అప్పటికే ఆ బస్సులో ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించి వేశారు. ఏలూరు సమీపంలోని రత్నాస్ హోటల్ వద్ద, గుండుగొలను సమీపంలోని గరుడ హోటల్ సమీపంలో రహదారిపై లారీలు ఇతర వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆకస్మికంగా జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. పెట్రోలింగ్ వాహనాల పోలీస్ సిబ్బందికి హెచ్చరికలు జారీచేశారు. రహదారిపై పార్కింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్ వాహనం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.