జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారం కేసులో అప్రైజర్ అరెస్టు
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:34 AM
కుటుంబ అవసరాల కోసం తాము కష్టపడి సంపాదించు కున్న బంగారాన్ని తమ కుటుంబ అవసరాల నిమి త్తం బ్యాంకులో కుదువ పెట్టుకుంటూ ఉంటారు.
4.120 కేజీలు స్వాధీనం
పోలీసు అధికారులను సత్కరించిన బాధితులు
ఐదుగురు బ్యాంకు ఉద్యోగుల పాత్ర.. త్వరలో అరెస్టు చేస్తాం
నిందితుల ఆస్తులు సీజ్ : ఎస్పీ
ఏలూరు క్రైం, జూలై 10(ఆంధ్రజ్యోతి): కుటుంబ అవసరాల కోసం తాము కష్టపడి సంపాదించు కున్న బంగారాన్ని తమ కుటుంబ అవసరాల నిమి త్తం బ్యాంకులో కుదువ పెట్టుకుంటూ ఉంటారు. ఒక జాతీయ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా ఉన్న వ్యక్తి ఆ ప్రాంత ప్రజలకు ఎంతో నమ్మకంగా గోల్డ్లోన్లను ఆ బ్యాంక్ ద్వారా అందిస్తూ తనపై వారికి నమ్మకం కలిగించాడు. ఆ నమ్మకమే వారిని నట్టేట ముంచేసింది. లబోదిబోమంటూ పోలీసు లను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేసి నాలుగు కేజీల 120 గ్రాముల బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం లో ఎస్పీ కేపీఎస్కిశోర్ కేసు వివరాలను తెలిపారు.
జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ బరోడా బ్రాంచ్లో స్థానిక వెలమపేటకు చెందిన చలపాక రాజు (40) గోల్డ్ అప్రైజర్గా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజలకు ఎంతో నమ్మకస్తుడిగా ఉండడంతో ఆ ప్రాంత వాసులు అతని చేతికి బంగారం ఇచ్చి బ్యాంకులో పెట్టి లోను ఇప్పించమని అడిగే స్థాయి లో నమ్మకం కలిగించుకున్నాడు. 2024 నుంచి ఆ బ్యాంకులో సరైన ఆడిట్ లేకపోవడంతో ఇదే అదనుగా తీసుకున్న అతను అప్పటి నుంచి దశల వారీగా బ్యాంకులో ఖాతాదారులు కుదువపెట్టిన బంగారాన్ని అపహరించుకుపోయి వివిధ ప్రాంతా ల్లో తాకట్టు పెట్టాడు. ఇటీవల బాధితులు తమ లోను తీర్చి బంగారపు వస్తువులు తీసుకోవడానికి వెళ్లగా అవి కనిపించకపోవడంతో ఆందోళనకు దిగారు. ఆ బ్యాంకు అధికారులు ఖాతాదారులు గోల్డ్లోన్ పెట్టిన దరఖాస్తులన్నీ పరిశీలించారు. మొత్తం 176 మంది ఖాతాదారులకు చెందిన ఆరు కేజీల 449 గ్రాముల బంగారపు ఆభరణాలు అప హరణకు గురైనట్టు గుర్తించి ఆ బ్యాంక్ సీనియర్ మేనేజర్ జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్ఐ వీర ప్రసాద్, లక్కవరం ఎస్ఐ జబీర్, జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సంపత్ సిబ్బంది కలిసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అప్రైజర్ రాజు ను అదుపులోకి తీసుకుని అతను వివిధ బంగారం షాపుల్లో తాకట్టుపెట్టిన ఆభరణా లను స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి రూ.పది లక్షల నగదు, నాలుగు కేజీల 120 గ్రాముల బంగారపు వస్తు వులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదు గురు బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయిందని వారినీ అరెస్టు చేస్తా మన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా నిందితుల ఆస్తులను సీజ్ చేయనున్నట్టు వెల్లడిం చారు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ సుస్మిత, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులే దేవుళ్లు : బ్యాంకు బాధితులు
తాము బ్యాంకులోపెట్టిన బంగారపు ఆభరణాలు అపహరణకు గురి కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో బాధితులు శుక్రవారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ, ఏఎస్పీ కృతజ్ఞతలు తెలిపి వారితో పాటు ఇతర సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడే డాక్టర్లను దేవుడిగా అభివర్ణిస్తారని కానీ మాన ప్రాణాలను, ఆస్తులను కాపాడుతున్న పోలీసులే నిజమైన దేవుళ్లని, ఆభరణాలు స్వాధీనం చేసుకుని తమకు మనోధైర్యం కల్పించారని పేర్కొన్నారు. గతంలో చింతలపూడిలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఇదే విధంగా గోల్డ్ను అపహరించుకుపోవడంతో ఆ కేసులోను బాధితులకు న్యాయం చేశారని గుర్తు చేశారు.
అతిగా నమ్మొద్దు : ఎస్పీ
ఎంతో కాలం నుంచి ఎంతో పరిచయం ఉన్న ఎంత తెలిసిన వ్యక్తి అయినా అతిగా నమ్మవద్దని ఎస్పీ కేపీఎస్ కిశోర్ స్పష్టం చేశారు. కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన బాధితులను ఉద్దేశించి ఆయ న మాట్లాడారు. బ్యాంకులో తాకట్టు పెట్టేటప్పుడు నిబంధనల ప్రకారం అన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని అతిగా నమ్మి వస్తు వులను ఇవ్వకూడదని సూచిం చారు. ఆన్లైన్ పెట్టుబడులు పెట్టవద్దని, నేడు సమాజంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానం ఎంతవేగంగా అభివృద్ధి చెందిందో నేరగాళ్లు అదే విధంగా పెరిగిపోయారని, ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే 112కు కాని పోలీసులకు కాని సమాచారం అందించాలన్నారు.