అకాల వర్షం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:08 AM
వాతావరణం మార్పుతో రైతుల్లో భయం పట్టుకుంది. వరి చివరిలో వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం దాళ్వా సాగుకు గండంగా మారింది.
జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ధాన్యం రాలి దిగుబడి తగ్గుతుందనే భయం
చేలల్లో నీరుతో మాసూళ్లకు ఆలస్యం
భీమవరం రూరల్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : వాతావరణం మార్పుతో రైతుల్లో భయం పట్టుకుంది. వరి చివరిలో వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం దాళ్వా సాగుకు గండంగా మారింది. పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు పంట చేలల్లో నీరు చేరింది. మరో పది రోజుల్లో మాసూళ్లు అయ్యే సమయంలో వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. దీనివల్ల పంట మాసూళ్లు ఆలస్యమవు తుందని అంటున్నారు. గాలులకు అక్కడక్కడా చేలు నేలవాలాయి. జిల్లాలో 2 లక్షల 31 వేల ఎకరాల్లో దాళ్వా సాగు చేశారు. పంట దశకు చేరుకున్న, గింజ పాలుపోసుకునే చేలకు అకాల వర్షాలు నష్టం చేకూరుస్తాయని రైతులు అంటున్నారు.
మాసూళ్లు వాయిదా వేసుకోండి : జేసీ
జిల్లాలో రానున్న రోజుల్లో స్వల్ప నుంచి మధ్యస్తంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపినందున రైతులు పంట మాసూళ్లు వాయిదా వేసుకోవాలని జేసీ రాహుల్ కూమార్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. మాసూళ్లయిని ధాన్యం తడిస్తే చేయవలసి సూచనలు ఆయన తెలిపారు.
తడిసిన ధాన్యం
తాడేపల్లిగూడెం రూరల్/తణుకు రూరల్ ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): అకాల వర్షం రైతన్నలను ముంచెత్తింది. తాడేపల్లిగూడెం మండలంలో వరి మాసూళ్లు ప్రారంభం కావడంతో సోమవారం కురిసిన వర్షంతో కల్లాల్లోని దాన్యం తడిసి ముద్దయింది. మండలం లోని మోదుగగుంట, అప్పారావుపేట, కొండ్రుప్రోలు, కుంచనపల్లి, తదితర గ్రామాల్లో వరికోత మిషన్ల ద్వారా కోసిన ధాన్యం కల్లాల్లోనే తడిసిపోయింది. కొన్ని చోట్ల బస్తాల్లో నింపిన దాన్యం తడిసిపోవడంతో రైతులకు అదనపు భారం పెరిగింది. ఇదిలా ఉంటే దండగర్రలో రేషన్ డిపోలో పంపిణీ చేయాల్సిన బియ్యం బస్తాలు వర్షపునీటిలో తడిసిపోయాయి.
నేలవాలిన స్వర్ణ రకం
స్వర్ణ రకం చేలు వాలిపోయిపోనట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తణుకు మండలంలోని వరి పంటలో 99 శాతం 1121 రకం సాగు చేయగా మిగిలింది స్వర్ణ, ఇతర రకాలు సాగు చేశారు. ఈ వర్షం వల్ల వరి పంటకు ఎలాంటి ఇబ్బందులు వుండదని కానీ చేలల్లో నీరు నిలబడి కోతలకు ఇబ్బందిగా వుంటుందని వ్యవసాయ అధికారి కే.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.