రైతు వద్ద నిషేధిత గ్లైసెల్ కలుపు మందు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:59 PM
ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు సీజ్ చేసి గురువారం స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో లభించిన 360 లీటర్ల డబ్బాలు
కేసు నమోదు చేసి విచారణకు జేడీ ఆదేశం
టి.నరసాపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు సీజ్ చేసి గురువారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గుర్వాయిగూడేనికి చెందిన రైతు కె.నాగేశ్వరరావుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో ఉన్న షెడ్డులో నిషేధిత గ్లైసెల్ కలుపు మందు అక్రమ నిల్వలు ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియాంకకు అందిన సమాచారంతో చింతలపూడి ఏడీఏ సుబ్బారావుతో కలిసి ఆమె రైతు షెడ్డును పరిశీలించారు. దీంతో షెడ్డులో 360 లీటర్ల గ్లైసెల్ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. రైతు నాగేశ్వరరావును విచారించగా రైతులమంతా కలిసి గడ్డి నివారణకు తెచ్చుకున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న జేడీ హబీబ్ బాషా షెడ్డు వద్దకు చేరుకుని పరిశీలించారు. వీఆర్వో సమక్షంలో ఆ మందులను స్వాధీనం చేసుకుని రైతుపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. జేడీ మాట్లాడుతూ గ్లైసెల్ కలుపు మందును నిషేధించారని, క్రయ, విక్రయాలు నేరమ, వీటి శాంపిల్ తీసుకుని లాబ్కు పంపుతామన్నారు. అక్రమ నిల్వలపై విచారణ జరిపుతామన్నారు. దీని వెనుక ఎవరున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు గ్లైసెల్పై ఉన్న నమ్మకంతో అక్రమదారులు నకిలీలు తయారు చేసి విక్రయిస్తున్నారని, రైతులు మోసపోవద్దని సూచించారు.