చెత్త మాయం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:21 AM
నరసాపురం పట్టణంలో పేరుకుపోయిన చెత్తకు తాత్కాలికంగా ఉపశమనం లభిం చింది. కలెక్టర్ నాగరాణి చొరవతో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను మంగళవారం జిల్లాలోని ఇతర పురపాలక సంఘాల్లోని డపింగ్ యార్డులకు తరలించే పని చేప ట్టారు.
ఊపిరి పీల్చుకున్న నరసాపురం ప్రజలు
జిల్లాలోని ఇతర డంపింగ్ యార్డులకు తరలింపు
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
నరసాపురం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): నరసాపురం పట్టణంలో పేరుకుపోయిన చెత్తకు తాత్కాలికంగా ఉపశమనం లభిం చింది. కలెక్టర్ నాగరాణి చొరవతో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను మంగళవారం జిల్లాలోని ఇతర పురపాలక సంఘాల్లోని డపింగ్ యార్డులకు తరలించే పని చేప ట్టారు. 20 రోజులుగా పట్టణ వీధుల్లో, కూడళ్లలో పేరుకపోయిన చెత్తకుప్పలు మాయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఏడాదిగా పట్టణంలో చెత్త సమస్య తీవ్రమైంది. కంపోస్టుయార్డుకు స్థలం లేకపోవడంతో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వేస్తూ నెట్టికొస్తున్నారు. గుంటూరు కూడా తరలించారు. అయితే అన్ని స్థలాలు నిండిపోవడంతో ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.దీంతో 15 రోజులుగా చెత్త సేకరణ నిలిపివేశారు. ఈ కారణంగా పట్టణంలో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పగలు ఈగలు, రాత్రి దోమలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వీటికి తోడు రోడ్డు మీదకు రావాలంటే ముక్కు ముసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేప థ్యంలో ‘ఎక్కడ చూసినా.. చెప్పకుప్పలే’ అంటూ ఆంధ్రజ్యోతి గత నెల 23న కథనం ప్రచరించింది. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. తిరిగి ఈ నెల 3న ‘కంపు కొడుతోంది’ నరసాపురానికి ఏమైంది అంటూ మరో కథనం ప్రచురించింది. కంపుతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేసింది. దీనిపై స్పందించిన అధికారులు సమస్యను జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం కమిషనర్ వెంకట్రామిరెడ్డి కలెక్టర్ను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లాలోని ఇతర పురపాలక సంఘ కమిషనర్లతో చర్చిం చారు. తాత్కాలికంగా నరసాపురంలోని చెత్తను మీ కంపోస్టు యార్డులో వేయించు కోవాలని అదేశించారు. దానికి అనుగు ణంగా మంగళవారం ఉదయం మునిసిపల్ అధికారులు నాలుగు టిప్పర్లు పెట్టారు. జేసీబీ సాయంతో చెత్తను భీమవరం, తణుకు, పాల కొల్లు, టీపీగూడెం పురపాలక సంఘాలకు తరలించారు. స్టీమర్రోడ్, కనకదుర్గా ఆర్చి, రైతు బజార్, మార్కెట్, పంజా సెంటర్, శ్రీహరిపేట వంటి ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కమిషనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ప్రస్తుతం 300 టన్నులపైనే చెత్త ఉందన్నారు. దీన్ని తరలించేందుకు ఇంకా నాలుగైదు రోజులు పడుతుందన్నారు.