అయ్యో.. ఆక్వా రైతు !
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:35 AM
వాతావరణంలో మార్పులతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయి. వైరస్ను అరికట్టే అవకాశం లేక ఆక్వా రైతులు హడావిడిగా రొయ్యల పట్టుబడులను నిర్వహిస్తున్నారు.
అయ్యో.. ఆక్వా రైతు !
ఆక్సిజన్ అందక చనిపోతున్న రొయ్యలు
పలుచోట్ల హడావుడిగా పట్టుబడులు
ముదినేపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆక్వాకు అకాల
కష్టం వచ్చిపడింది. రొయ్యల సాగుపై వైరస్ పంజా విసిరింది.
వాతావరణంలో మార్పులతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయి. వైరస్ను అరికట్టే అవకాశం లేక ఆక్వా రైతులు హడావిడిగా రొయ్యల పట్టుబడులను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఎల్నినో ప్రభావం రొయ్యల సాగుపై చూపిస్తున్నదని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 2.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగు తుంది. వైరస్ వ్యాప్తితో రెండు రోజులుగా సుమారు 30 శాతం విస్తీర్ణంలోని చెరువుల్లో రొయ్యల పట్టుబడి జరిగినట్లు సమాచారం. ఎక్కువ శాతం 140 నుంచి 160 కౌంట్ రొయ్యలకే వైరస్ సోకుతుండడంతో ఆ సైజు రొయ్యలు తెగుళ్ళను తట్టుకోలేక చనిపోతున్నాయి. దీంతో ఆక్వా రైతులు నష్టం వస్తున్నప్పటికీ రొయ్యలను పట్టేసి అమ్మేస్తున్నారు.
రొయ్యకు సోకుతున్న వైరస్
వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యలకు ఆందోళన కలిగించే వ్యాధులే సోకుతున్నాయి. ప్రమాదకరమైన వైట్స్పాట్ సిండ్రోమ్ వైరస్ జిల్లా వ్యాప్తంగా రొయ్యలకు సోకుతున్నది. ఈ వైరస్ వల్ల నీటి ఉపరితలంపై, చెరువు గట్ల వెంబడి నీరసంగా ఈదుతూ చనిపోతాయి. ఈ వ్యాధికి సరైన చికిత్స కూడా లేదు. రొయ్యల ఎదుగుదల పూర్తిగా ఆగిపోయే ఈహెచ్పి, వైట్గట్ వ్యాధులకు కూడా రొయ్యలు గురవుతున్నాయి. వేసవిలో వచ్చే వైరస్లు కూడా ఈ సీజనులో రొయ్యలకు సోకుతుండడం రైతులకు ఆందోళన కలిగిస్తున్నది. సీడ్ దశ నుంచే వైరస్ వ్యాపించడం మరింత ఆందోళనకరంగా ఉంది.
ప్రభుత్వం ఊతమిచ్చినా..
రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం పలు రకాలుగా ఊతమిచ్చినా వైరస్ల బారి నుంచి ఆక్వా రంగం బయటపడలేకపోతున్నది. ఆక్వాకు అవసరమయ్యే విద్యుత్ పరికరాలకు సబ్సిడీ, ఆక్వాకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా, మేత ధరల నియంత్రణ, మార్కెటింగ్లో సిండికేట్లను నియంత్రించడం లాంటి ప్రభుత్వ పథకాలతో ఊరట చెందుతున్న ఆక్వా రైతులు ఊహించని రీతిలో వ్యాపిస్తున్న వైరస్తో కుంగిపోతున్నారు. ఏ సీజనులో ఏయే వ్యాధులు సోకుతాయన్న అంశాలపై ఎక్కువ శాతం మంది రైతులకు అవగాహన లేకపోవడం, పరిశోధనలు నిర్వహించి సరైన సలహాలు ఇచ్చే వ్యవస్థలు లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
వైరస్లతో నష్టం
– బొప్పన సుందరరామయ్య, ఆక్వా రైతు, ములకలపల్లి
వాతావరణంలో మార్పులతో సంభవి స్తున్న వైరస్ వల్ల ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల నష్టం సంభవి స్తున్నది. 140 నుంచి 160 కౌంట్ దశలోనే రొయ్యలను పట్టేస్తున్నందున ఎకరాకి రూ. లక్ష నష్టం వస్తున్నది. ఆ సైజు రొయ్యకు పెద్దగా ధర ఉండదు.
కుంగదీస్తున్న వైరస్
– బాసినశెట్టి కిషోర్, ఆక్వా రైతు, బొమ్మినంపాడు
వైరస్లు ఆక్వా రైతులను కుంగదీస్తు న్నాయి. గతంలో వాతావరణంలో భారీ మార్పులు సంభవించినప్పుడు రొయ్య లకు వైరస్ వచ్చేది. ఇప్పుడు సీడ్ ద్వారానే వైరస్ చెరువులోకి ప్రవేశిస్తున్నది.
అన్నీ కష్టనష్టాలే
– గుడివాడ వేణు, పెదగొన్నూరు
ఆక్వా రైతులకు సీజన్తో సంబం ధం లేకుండా నిరంతరం కష్టాలు ఎదురై నష్టాలు సంభవిస్తున్నాయి. రొయ్యల సాగుకు ప్రభుత్వం అండగా ఉన్నా వైరస్ల ప్రభావంతో నష్టాలు వస్తున్నాయి.