ఆర్థిక ఊరట!
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:18 AM
ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగా రెడ్డిగూడెం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2024–25 కింద రూ.8.36 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరయ్యాయి.
ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగా రెడ్డిగూడెం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2024–25 కింద రూ.8.36 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆయా పాలకవర్గాల వెసులు బాటును బట్టి వివిధ రకాల పనులు చేసుకోవడానికి వీలు కల్పించారు. కొద్ది నెలల్లో పాలకవర్గాలు గడువు ముగు స్తున్న తరుణంలో ఈ పనుల తో పురాలు అభివృద్ధి బాటలో పయనించనున్నాయి. చింతల పూడికి స్పెషల్ గ్రాంట్లు మంజూరు చేశారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పురాలకు కూటమి ప్రభుత్వం దశలవారీగా 15వ ఆర్థిక సంఘం నిధులతో సాంత్వన చేకూర్చు తోంది. అప్పటి పాలకుల హయాంలో వివిధ పథకాల పేరిట హడావుడే తప్ప కనీసం మౌలిక వసతులకు దూరంగానే ప్రజలు సమస్యలతో సతమతం అయ్యేవారు. తాజాగా పురాలకు నిధులు విడుదలతో ఏలూరు నగరం, జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో అభివృద్ధి పట్టాలెక్కనుంది.
ఏలూరులో రోడ్లు, డ్రెయిన్లకు ప్రాధాన్యం
ఏలూరు నగరంలో విలీనమైన పంచాయతీల్లో చాలావరకు రోడ్లు, డ్రెయిన్లకు ఇప్పటి పాలకవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి, పోణంగి, చొదిమెళ్ల, వెంకటాపురం, కొమడవోలు నగరంలో కలిపి ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. వీటిని సత్వరం అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడుల్లా అసెంబ్లీలో నగరాభివృద్ధికి ఉపయోగపడే అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా రూ.3.91 కోట్లు రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి ప్రతిపాదించారు. ఈనెలలోనే టెండర్లు పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం, అధికారులు అడుగులు వేయనున్నారు.
అభివృద్ధి దిశగా జంగారెడ్డిగూడెం
ఇటీవలే స్పెషల్ గ్రేడ్–1 మునిసిపాలిటీ వర్గోన్నతి పొందిన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి మెరుగైన రీతిలోనే ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ప్రధానంగా ఇక్కడా రోడ్లు, డ్రెయిన్లకే ప్రాధాన్యం ఇచ్చారు. రూ.3.64 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.
నూజివీడులో వంతెనలకు ప్రతిపాదనలు
నూజివీడు పురపాలక సంఘంలో ప్రత్యేకించి అవసానదశలో ఉన్న వంతెనలు మరమ్మతులు, నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక్కడ రూ.1.81 కోట్లు ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి.
చింతలపూడికి ప్రత్యేక గ్రాంట్లు
ఇప్పటి వరకు ఎన్నికలు జరగని చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చొరవతో పురపాలక సంఘం సాధించింది. 15 సిమెంట్ రోడ్లకు రూ.రెండు కోట్లు ప్రత్యేక గ్రాంట్ మంజూరైంది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఇడా) నుంచి రూ.1.50 కోట్లు మౌలిక వసతుల కల్పనకు మంజూర య్యాయి. డీఎఫ్ఎం ఫండ్ కింద రూ.60 లక్షలు వివిధ పనులకు మంజూరయ్యాయి.