Share News

నూక బియ్యంతో ఇథనాల్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:45 AM

ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచేం దుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

నూక బియ్యంతో ఇథనాల్‌

ఇంధనానికి ప్రత్యామ్నాయం

జిల్లాలో 80 వేల టన్నుల సేకరణ

రబీలో ఉత్పత్తి కానున్నదని అంచనా

మిల్లర్ల నుంచి తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచేం దుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే జిల్లా నుంచి బియ్యం నూకను సేకరిస్తోంది. ఒకవైపు రేషన్‌ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 10 శాతం నూకతోనే మిల్లర్ల నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని తీసుకుంటు న్నాయి. వాటిని రేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందజేయను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. స్టీమ్‌ బియ్యాన్ని సరఫరా చేయాలని యోచిస్తోంది. వాస్తవానికి గతంలో 25 శాతం నూకతో బియ్యాన్ని తీసుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం నూక ఉండేలా చూసుకుంది. తాజాగా ఈ రబీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నూకకే పరిమిత మయ్యాయి. దీనివల్ల మిల్లర్ల వద్ద మిగిలి పోతున్న నూక బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది.బియ్యంలో నూక శాతాన్ని తగ్గించడం వల్ల మిల్లర్లు నష్ట పోకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. మిల్లర్లకు గతంలో ఒక కన్‌సైన్‌మెంట్‌కు 47 టన్నుల ధాన్యాన్ని అప్పగించేవారు. ప్రస్తుతం 54 టన్నులు అప్పగిస్తున్నారు. అదనంగా 7 టన్నుల ధాన్యం ఇస్తున్నారు. మిల్లర్ల నుంచి ఒక కస్‌సైన్‌మెంట్‌కు సరిపడా బియ్యాన్ని తీసుకుంటున్నారు. మిల్లర్ల వద్ద మిగిలిపోయిన నూక బియ్యాన్ని కేంద్రం తీసుకుం టోంది. ఇథనాల్‌ కంపెనీలకు సరఫరా చేస్తోంది.

రబీ సీజన్‌ పూర్తి

రబీ సీజన్‌లో 80 వేల టన్నుల నూక బియ్యం మిల్లర్ల నుంచి సేకరించేలా పౌర సరఫరాల కార్పొరేషన్‌ సిద్ధమవుతోంది. మిల్లుల వద్ద నిల్వ సామర్థ్యం ఉండదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నూక బియ్యాన్ని తరలిస్తు న్నారు. గడచిన రబీలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 7.90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల నుంచి ప్రతి గింజా సేకరించింది. రైతు ఖాతాల్లో రూ. 1,847 కోట్లు జమ చేసింది. కస్టమ్‌ మిల్లింగ్‌కు ధాన్యం మొత్తాన్ని అప్పగించారు. తిరిగి మిల్లర్ల నుంచి బియ్యం సేకరణకు కసరత్తు చేశారు. మిల్లర్లకు సైతం కూటమి ప్రభుత్వంలో బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తొలుత మిల్లర్లు వ్యతిరేకించారు. మిల్లుల వద్ద 15 శాతం నూక మిగిలిపోతే నిల్వ ఉండదని ఆందోళన చెందారు. ఇది దెబ్బతింటే నష్టపోతామంటూ ఆందోళన చెందారు. మరోవైపు మిల్లుల వద్ద నిల్వ సామర్థ్యం లేకపోతే ఇబ్బందులు పడతామని గుబులు చెందారు. నూక బియ్యం సేకరణలో తమ అనుమానాలను ప్రభుత్వం ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇథనాల్‌ ఉత్పత్త కోసం నూక అవసరాన్ని గుర్తించింది. మిల్లర్లను ఒప్పించింది. పదిశాతం బియ్యంతో పాటు, మిల్లర్ల వద్ద మిగిలిపోయే నూక బియ్యాన్ని కూడా తీసుకుంటోంది.

Updated Date - Jun 16 , 2026 | 12:45 AM