ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:38 AM
ముసునూరులో ఈనెల 24న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.
ముసునూరు, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి):ముసునూరులో ఈనెల 24న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కలెక్టర్ కె.వెట్రి సెల్వి, ఎస్పీ కె.ప్రతాప్శివకిశోర్, జేసీ అభిషేక్ గౌడ, కేంద్ర, రాష్ట్ర భద్రతా అధికారులతో కలిసి ఏర్పాట్లను శనివారం మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభాస్థలం, పార్కింగ్ ప్రదేశం, వాహనాలు, కాన్వాయ్ రూట్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ముసునూరులోని గౌర్మెటు పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నూతన సీడ్ ఆవిష్కరణలో పాల్గొంటారన్నారు. ఆయనతోపాటు సీఎం చంద్రబాబు, గవర్నర్ ఎస్. అబ్దుల్నజీర్ పాల్గొనే అవకాశం ఉందన్నారు. పర్యటన పనులు, రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటన సజావుగా జరి గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ వినూత్న, ఆర్అండ్బీ ఎస్ఈ విజయరత్నం, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ రమేష్, డీపీవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.