Share News

దొరికితే.. రూ.పదివేలు!

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:08 AM

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా 500 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. మరో 1,500 మంది క్షతగాత్రులవుతున్నారు. వీరిలో 500 మంది వరకు శాశ్వతంగా అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ ప్రమా దాల్లో అత్యధికం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయి.

 దొరికితే..  రూ.పదివేలు!

మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తే జరిమానా తప్పదు

నివారణకు చట్టంలో మార్పులు

జరిమానా చెల్లించకుంటే జైలుకెళ్లాల్సిందే..

జిల్లాలో నిత్యం విస్తృతంగా తనిఖీలు

గతేడాది 2,462 కేసులు నమోదు

ఈ ఏడాది ఇప్పటి వరకు 628..

ఏలూరు క్రైం, మార్చి 2(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా 500 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. మరో 1,500 మంది క్షతగాత్రులవుతున్నారు. వీరిలో 500 మంది వరకు శాశ్వతంగా అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ ప్రమా దాల్లో అత్యధికం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులపై పోలీసులు దృష్టి పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అరెస్ట్‌ చేస్తున్నారు. వీరికి కొత్త చట్టాల ప్రకారం న్యాయస్థానాలు రూ.పది వేలకుపైగా జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నారు.

మారుతున్న కాలంతోపాటే వాహనాల వేగంలోను మార్పు వస్తోం ది. బైక్‌లు రేసు బైక్‌ల్లా దూసుకుపోతున్నాయి. దుర దృష్టం ఏమిటంటే జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది హెల్మెట్‌ ధరించకపోవ డం వల్ల.. ఇంకొందరు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మృత్యువాత పడుతున్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

రాత్రిపూట రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు పోగొట్టడానికి ఫేస్‌వాష్‌ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడప కుండా నియంత్రించడానికి బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేపడు తున్నారు. ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాల నివా రణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. మోటారు వాహన చట్టాల్లో సవరణ చేశారు. బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేస్తున్నప్పడు ఆల్కహాల్‌ శాతం 35 శాతం లోపు ఉంటే ఎంవీ యాక్టు 184 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి వారిని కోర్టుకు హాజరుపరుస్తారు. రూ.ఐదు వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించవచ్చు. 35 శాతం కంటే ఎక్కువ అల్కహాల్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై మోటారు వాహన చట్టం సెక్షన్‌ 185 ప్రకారం కేసు నమోదు చేస్తారు. రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, రెండేళ్ల జైలు, డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌ చేయడం కాని పూర్తిగా రద్దు చేస్తారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తూ వాహన తనిఖీలను చేయిస్తున్నారు.

కేసులు..జరిమానాలు

జిల్లాలో గతేడాది జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించి 2,462 కేసులు నమోదు చేశారు. వారికి 38 లక్షల 75 వేల 600 రూపాయలు జరిమానా కోర్టులు విధించాయి. ఈ ఏడాది జనవరిలో 294 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు హాజరుపర్చగా నాలుగు లక్షల 32 వేల 500 రూపా యల జరిమానా విధించారు. ఫిబ్రవరిలో 325 కేసులు నమోదు చేయగా నాలుగు లక్షల 50 వేలకు పైబడి కోర్టులు జరిమానాలు విధించాయి. మార్చిలో ఇప్పటి వరకు తొమ్మిది కేసులు చేయగా సోమవారం నలుగురిని కోర్టుకు హాజరు పర్చగా రూ.40 వేల జరిమానా విధించారు.

ఇటీవల రాజమండ్రి నుంచి తమిళనాడుకు లారీలో వెళ్తున్న లారీ డ్రైవర్‌ పూటుగా మద్యం తాగి ఏలూరు సమీపంలోని మెయిన్‌ బైపాస్‌ దుగ్గిరాల బ్రిడ్జి వద్ద సర్వీసు రోడ్డులోకి వచ్చి కాలేజీ బస్సును ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో ఒక ఆటో డ్రైవర్‌ చింతలపూడి రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొన డంతో మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో ఒక విద్యార్థిని, మహిళ, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

నలుగురికి జరిమానా

ఏలూరు క్రైం, మార్చి 2(ఆంధ్రజ్యోతి):మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల వంతున ఏలూరు రెండవ తరగతి స్పెషల్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మురళీకృష్ణ సోమ వారం తీర్పు చెప్పారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పర్య వేక్షణలో వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సుధాకర్‌ సిబ్బందితో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిం చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న దెందు లూరు మండలం కొవ్వలికి చెందిన గారపాటి దుర్గా ప్రసాద్‌, ఏలూరు వపర్‌పేటకు చెందిన కురిసేటి వెంకట సాయి శశాంక్‌, పెదవేగి మండలం మొండూ రుకు చెందిన గడ్డం సందీప్‌, మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన ముసునూరి రమేష్‌ పట్టు బడ్డారు. వీరిని ఏలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పర్చగా ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:08 AM