ఉత్కంఠగా.. బధిరుల అథ్లెటిక్స్ పోటీలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:18 AM
ఏలూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బదిర (మూగ, చెవిటి) అథ్లెటిక్స్ టోర్నీలో వారి క్రీడా స్ఫూర్తితో వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని చాటారు.
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి) : ఏలూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బదిర (మూగ, చెవిటి) అథ్లెటిక్స్ టోర్నీలో వారి క్రీడా స్ఫూర్తితో వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని చాటారు. స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో శనివారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బధిరుల క్రీడాకారుల ఎంపికలో భాగంగా 6వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బదిర అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారిని ప్రోత్సహిస్తే సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు వై.సీతారామప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు పరుగు, లాంగ్ జంప్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. పది జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన బధిర క్రీడాకారులు మార్చి 20 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న యూనివర్సిటీ స్టేడియంలో జాతీయస్థాయి బధిర క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు.