Share News

ఇరిగేషన్‌ పనులపై ప్రతిపాదనలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:12 AM

జిల్లాలో కాలువలు, చెరువులు, ఫీడర్‌ చానల్స్‌లో పూడికతీత, పునర్నిర్మాణం, ఆక్రమణల తొలగింపు తదితర పనులపై ఇంజనీరింగ్‌ అధికారులు ఈనెల 15లోగా ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు.

 ఇరిగేషన్‌ పనులపై ప్రతిపాదనలు
సోమవరప్పాడు సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

కలెక్టర్‌ వెట్రిసెల్వి

దెందులూరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి):జిల్లాలో కాలువలు, చెరువులు, ఫీడర్‌ చానల్స్‌లో పూడికతీత, పునర్నిర్మాణం, ఆక్రమణల తొలగింపు తదితర పనులపై ఇంజనీరింగ్‌ అధికారులు ఈనెల 15లోగా ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు. పది రోజుల్లో పాలనాపరమైన ఆమోదం, 70 రోజుల్లోగా పనులు పూర్తి, జూలై 14లోగా బిల్లులు సమర్పించేలా 100 రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు. జలవనరుల శాఖ వంద రోజుల నీటి సంరక్షణ ప్రణాళికలో భాగంగా ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవరప్పాడులో కొత్త చెరువు వద్ద సోమవారం నిర్వహించారు.ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాల్లో చెరువుల సంరక్షణ, భూగర్భ జలాలు పెంపులో సాగునీటి సంఘాలది కీలక పాత్ర అన్నారు. సోమవరప్పాడులో ఉపాధి నిధులతో చేపట్టిన రహదారి పనులను వారు పరిశీలించారు. తహసీల్దార్‌ సుమతి, ఎంపీడీవో వీరప్రతాప్‌, గోదావరి కాల్వ డీసీ చైర్మన్‌ వెలమాటి రాంబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామసీత, ఇరిగేషన్‌ ఎస్‌ఈ దేవప్రకాష్‌, ఆర్డీవో కిశోర్‌, వ్యవసాయశాఖ జేడీ హబీబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లాలో నీటి సంరక్షణ పనులపై సాగు నీటి సంఘాల ప్రతినిధులతో కలిసి ఖరారు చేసి, గ్రామాల వారీగా కలిసి పరిశీలించి నివేదికలను త్వరితగతిన ఎంపీడీవోలు సమర్పించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులపై అధికారులతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

Updated Date - Apr 07 , 2026 | 12:12 AM