పప్పు అన్నం గొంతుకు అడ్డుపడి..
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:40 AM
పప్పు అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని మార్కండేయపురం జగనన్న లేఅవుట్ కాలనీ ఎల్–3లో చోటు చేసుకుంది.
మార్కండేయపురం జగనన్న లేఅవుట్ కాలనీలో బాలిక మృతి
జంగారెడ్డిగూడెం,జనవరి 30(ఆంధ్రజ్యోతి) : పప్పు అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని మార్కండేయపురం జగనన్న లేఅవుట్ కాలనీ ఎల్–3లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. స్థానికంగా నివాసం ఉంటున్న ర్యాలీ ఆంజనేయ కుమార్, భాను శిరీష దంపతులకు జెస్సీ దీవెన (2) అనే కుమార్తె ఉంది. శుక్రవారం కుమార్తెను ఇంటివద్ద భర్తకు అప్పగించి భాను శిరీష తన తల్లితో కలిసి పనిపై జంగారెడ్డిగూడెం వెళ్లారు. పప్పుతో అన్నం కలిపి కుమార్తెకు ఆంజనేయ కుమార్ తినిపించగా అన్నం గొంతుకు అడ్డుపడి ఊపిరందక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. భయంతో కేకలు వేస్తూ పక్కింటి మహిళ దుర్గను పిలవగా ఆమె వచ్చి బాలికకు సపర్యలు చేసింది. అదేసమయంలో అతను సమీప గ్రామం అక్కం పేటలో ఉన్న తన అక్క, బావలకు ఫోన్ చేయగా వారు హుటాహుటీన వచ్చి బాలికను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎన్.వీర ప్రసాద్ తెలిపారు.