హిందూ జాగరణకు కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్కు మద్దతివ్వండి : కేంద్ర మంత్రి వర్మ
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:41 AM
దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ హిందూ జాగరణకు నిస్వార్థంగా కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు.
హిందూ జాగరణకు కృషి చేస్తున్న
ఆర్ఎస్ఎస్కు మద్దతివ్వండి : కేంద్ర మంత్రి వర్మ
భీమవరం టౌన్, జనవరి3(ఆంధ్రజ్యోతి): దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ హిందూ జాగరణకు నిస్వార్థంగా కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నర్సయ్య అగ్రహారంలో శనివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని, జిల్లాలో 50 చోట్ల, భీమవరంలో 16 చోట్ల సమ్మేళనం నిర్వహించడం విశేషమన్నారు. రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం ఐక్యం కావాలని ఆకాంక్షించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రముఖ్ వోలేటి రవికుమార్ హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో మాధురి, యాతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.