Share News

విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం అవసరం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:39 AM

విద్యార్థులు భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చదువుతోపాటు నైపుణ్యం ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.

విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం అవసరం
కెరీర్‌ ఎగ్జిబిషన్‌ పోటీలను తిలకిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామ, కలెక్టర్‌ నాగరాణి

భీమవరం రూరల్‌, జనవరి3(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చదువుతోపాటు నైపుణ్యం ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కెరీర్‌ ఎగ్జిబిషన్‌ పోటీలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ నాగరాణితో కలిసి ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ హైస్కూళ్ల నుంచి 37 మంది విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్న తంగా తీర్చిదిద్దేందుకు జిల్లావ్యాప్తంగా కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌ కోసం ఆరుగురు శిక్షకులను నియమించిందన్నారు. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కౌన్సిలర్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇటువంటి సహకార వ్యవస్థ లేదన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలలో ఉత్తమంగా ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. అనంతరం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి మాట్లాడారు. సమగ్ర శిక్ష స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ కె.దివ్య, డీఈవో ఈ.నారాయణ, గర్ల్స్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జీఏ జెస్సీ దీవెనమ్మ, స్టేట్‌ అబ్జర్వర్లు భవ్యశ్రీ, శారదా దేవి, జిల్లా ఒకేషనల్‌ కో–ఆర్డినేటర్‌ పి.సంజీవ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:39 AM