శ్మశానవాటికలో మంత్రి నిమ్మల శ్రమదానం
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:11 AM
మహా శివరాత్రి రోజున ఆగర్తిపాలెం శ్మశానవాటికలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు.
పాలకొల్లు రూరల్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి రోజున ఆగర్తిపాలెం శ్మశానవాటికలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. శ్మశానవాటికలో వ్యర్థాలు, చెత్తచెదారం, పిచ్చిమొక్కలు, అంత్యక్రియలకు ఉపయోగించి పడవేసిన కుండలు తొలగించి శుభ్రం చేశారు. ఆయనతో పాటు గ్రామస్థులు కూడా శ్మశానవాటికను శుభ్రంచేసి ఆహ్లాదకరం గా తీర్చిదిద్దారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పవిత్రమైన మహా శివరాత్రి రోజున శ్మశానవాటికను శుభ్రం చేయటం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమసుందరం, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు, పి.రజనీకుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.
రూ.1.25 కోట్లతో శ్మశాన వాటికి అభివృద్ధి
నియోజకవర్గంలోని 6గ్రామాల శ్మశానవాటికల్లో రూ.1.25 కోట్లతో అభివృద్ది పనులకు ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఇటీవల పూలపల్లిలో గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించారు. రామానాయుడు మాట్లాడుతూ శ్మశానవాటికలు శివుడు నివసించే పవిత్ర స్థలాలన్నారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికను కైలాస వనంగా తీర్చిదిద్దామన్నారు. మిగిలిన అన్ని శ్మశాన వాటికలను దశల వారీగా ఇదే రకంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.