భీమా ఉడా రెడీ..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:38 AM
భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (భీమా–ఉడా) ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇన్చార్జి ప్లానింగ్ ఆఫీసర్గా ఈడా పీవో సుధాకర్..
తాత్కాలిక భవనానికి అన్వేషణ.. చైర్మన్ పదవి కోసం పార్టీల్లో పోటీ
భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (భీమా–ఉడా) ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా భీమవరంలో తాత్కాలిక కార్యాలయ భవ నం కోసం అన్వేషిస్తున్నారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఈడా) ప్లానింగ్ ఆఫీసర్ సుధాకర్ను భీమా–ఉడాకు ఇన్చార్జి ప్లానింగ్ ఆఫీసర్గా నియమించారు. కార్యాలయ భవన సముదాయం ఏర్పాటైన తర్వాత ఎనిమిది మంది సిబ్బందిని నియమిస్తారు. జిల్లాలోని వివి ధ శాఖల నుంచి డిప్యూటేషన్పై ఇక్కడ సిబ్బం దిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని నిర్వహణకు ఏడాదికి రూ.1.19 కోట్లు అవస రమవుతాయని అంచనా వేశారు. భీమా–ఉడాకు వచ్చే ఆదాయంతోనే వ్యయాన్ని భరించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. దీని పరిధి లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీతోపాటు 19 మండలాలను చేర్చారు. జిల్లాలో విలీనం చేసిన గణపవరం మండలాన్ని యథాతథంగా ఈడా పరిధిలోనే ఉంచారు.
మాస్టర్ ప్లాన్లు భీమా–ఉడా పరిధిలోకి
జిల్లాలోని స్థానిక సంస్థల మాస్టర్ ప్లాన్ల ఆమోదం, మార్పులు, చేర్పులు ఇక దీని పరిధి లోకి రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మాస్టర్ ప్లాన్లలో మార్పు లు, చేర్పులు చేయాల్సి వస్తే భీమా–ఉడాకు ఆ అధికారం ఉంటుంది. మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వస్తే వాటిపై పరిశీలన చేసి మార్పులకు అవకాశం ఉంటుంది.
తొలి చైర్మన్పై ఆసక్తి
భీమా–ఉడాకు తొలి చైర్మన్గా ఎవరిని నియ మిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈడా చైర్మన్ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ నాయకు డికి అప్పగించారు. భీమా–ఉడా చైర్మన్ పదవిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే చైర్మన్ను నియ మించనుంది ఈ పదవిపై ఆసక్తి చూపిన కొంద రు నాయకులు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ పదవులపై దృష్టి సారించారు.
అమరావతి ఎకనమిక్ రీజియన్ మీట్
ఏలూరు : స్వర్ణాంధ్ర–2047 లక్ష్యసాధనలో భాగంగా అమరావతి ఎకనమిక్ రీజియన్ తొలి సమావేశం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం లో బుధవారం జరిగింది. దీని పరిధిలోని ఏలూ రు జిల్లా కూడా వుండడంతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి హాజరై జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న అంశాలపై విశదీకరించారు.