Share News

ఆక్వాకు ‘ కూటమి’ భరోసా

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:07 AM

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేవిధంగా రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ అందించే జీవో 57ను మంగళ వారం పాలకొల్లులో విడుదల చేశారు.

ఆక్వాకు ‘ కూటమి’ భరోసా
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్రంలో మంత్రులు గొట్టిపాటి, అచ్చెన్నాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ, ఎమ్మెల్యేలు పితాని, కామినేని, పత్సమట్ల, ఎమ్మెల్సీ వీర్రాజు

నాడు నిబంధనలతో నాశనం చేసిన జగన్‌

విద్యుత్‌ సబ్సిడీ జీవో విడుదల చేసిన మంత్రులు

పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞతా సమావేశం

పాలకొల్లు అర్బన్‌/పాలకొల్లు టౌన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేవిధంగా రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ అందించే జీవో 57ను మంగళ వారం పాలకొల్లులో విడుదల చేశారు. పట్టణంలోని బ్రాడీపేట బైపాస్‌ రోడ్డులో నిర్వహించిన ఆక్వా రైతుల కృతజ్ఞతా సభకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా విచ్చేసిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆనాడు జగన్‌ పాదయాత్రలో రూపాయి న్నరకే విద్యుత్‌ సరఫరా చేస్తామని మాట ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత మాట మార్చాడన్నారు. నిబంధన లతో ఆక్వా రంగాన్ని కుదేలయ్యేలా చేశాడన్నారు. విద్యుత్‌ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ యూనిట్‌ ధర రూ1.50కే అందించడం వల్ల ఆక్వా రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని ఇందుకు ప్రభుత్వం సుమారు రూ.1100 కోట్లు ఆర్థిక భారం మోస్తోందన్నారు. జగన్‌ అరాచక పాలన వల్ల ప్రజలు అనేక విధాలుగా అవస్థలు పడ్డారన్నారు. ఈ ప్రభావం ఆక్వా రంగంపై కూడా పడిందన్నారు. మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గతంలో జగన్‌ హయాంలో ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ పేరుతో రైతులను విభజించి సబ్సిడీలో కోత పెట్టాడని సగం మంది రైతులు నష్టాల పాలయ్యారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఉచితం విధానం ఎత్తివేసి ప్రైవేటుగా కొనుగోలు విధానం ప్రవేశ పెట్టడం వల్ల ఆక్వా రైతులపై లక్షలాది రూపాయలు ఆర్థిక భారం పడిందన్నారు. గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిందని, నేడు ట్రూడౌన్‌ పేరుతో విద్యుత్‌ చార్జీలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేన్నారు. అన్నివర్గాల వారికి తీరని అన్యాయం చేసిన జగన్‌ నేడు ఓదార్పు యాత్రలు, మద్దతు, పరామర్శల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నా రని విమర్శించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం సుమారు 2.45 లక్షల ఎకరాల్లో విస్తరించిందని సుమారు 2 లక్షల మంది రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరు స్తోందన్నారు. ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, బొమ్మిడి నాయకర్‌, పులవర్తి రామాంజనేయులు, కామినేని శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, పి ధర్మరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌, కలెక్టర్‌ నాగరాణి, మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకర్‌ నాయక్‌, ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రులకు సంఘ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 12 , 2026 | 12:07 AM