పది పరీక్షలు ముగిశాయి
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:22 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో 132 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.
ఇంగ్లీష్ పరీక్షకు 22,616 మంది విద్యార్థులు హాజరు
ఈనెల 6 నుంచి మూల్యాంకనం
భీమవరం రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో 132 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. 22,909 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 22,616 మంది హాజరయ్యారు. 293 మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 41 పరీక్ష కేంద్రాలను, జిల్లా విద్యాశాఖ అధికారి రెండు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. చివరిరోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల హడావుడి కనిపించింది.పిల్లలు బయటకు వచ్చిన వెంటనే ఎలా రాశారు? పేపర్ ఎలా ఉంది ? ఎన్ని మార్కులు వస్తాయంటూ ఆతృతగా అడిగారు.మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు పది పరీక్షలు షెడ్యూల్గా నిర్ణయించారు. రంజాన్ పండుగ 20వ తేదీ సెలవుగా నిర్ణయించారు. దానిని 21కి మార్పు చేయడంతో ఆ రోజున ఉన్న ఇంగ్లిష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి మార్పు చేశారు. దీంతో గత నెలాఖరుతో ముగియాల్సిన పరీక్షలు ముందుకు జరిగాయి. ఈ నెల 4వ తేదీ నుంచి జరగాల్సిన జవాబు పత్రాల మూల్యాంకనం 6వ తేదీ నుంచి మొదలు కానునున్నది. వీరవాసరం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మూల్యాంకనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు డీఈవో నారాయణ తెలిపారు.
భీమవరం పట్టణంలోని చినరంగనిపాలెం మునిసిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ నాగరాణి తనిఖీ చేశారు. జిల్లాలో ఎటువంటి అంతరాయం లేకుండా పది పరీక్షలు విజయవంతంగా ముగియడం ఆనందకరమని తెలిపారు.