యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 31 , 2026 | 12:03 AM
మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదుపాడ గ్రామంలో చోటుచేసుకుంది.
గంట్యాడ, మే 30(ఆంధ్రజ్యోతి): మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదుపాడ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఏఎస్ఐ రమణ శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదుపాడ గ్రామానికి చెందిన నోట్ల అచ్చంనాయుడు(29) వివిధ పనుల కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆయన తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్వగ్రామానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిలో ఉన్న డబ్బులు ఖర్చు చేసి, బంగారం విక్రయించి మద్యం తాగేవాడు. దీనిపై తండ్రి భూలోక ప్రశ్నించారు. మనస్తాపం చెందిన అచ్చంనాయుడు శుక్రవారం రాత్రి గడ్డి మందును కొనుగోలు చేసుకుని ఊరికి దూరంగా వెళ్లి తాగాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అచ్చంనాయుడును ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం ఉదయం మృతిచెందారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.