Will They Dilute It? నీరుగార్చేస్తారేమో?
ABN , Publish Date - May 25 , 2026 | 12:09 AM
Will They Dilute It? సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే విచారణ ప్రక్రియలో ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉండడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ తీరుపై సందేహాలు
ఈ ప్రక్రియలో ప్రైవేట్ డ్యాక్యుమెంట్ రైటర్ ఎందుకో?
అంతా సక్రమమే అని తేల్చేందుకు యత్నాలు
పార్వతీపురం, మే24(ఆంధ్రజ్యోతి): సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే విచారణ ప్రక్రియలో ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉండడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ర్టేషన్లు సక్రమమే అని తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా విచారణను నీరుగార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
- 1978, ఏప్రిల్ 24న డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైంది. ఆ సంస్థ పేరిట సాలూరులో సుమారు మూడు ఎకరాలకు పైబడి భూములు ఉన్నాయి. అయితే వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. సాధారణంగా ఒక సొసైటీ లేదా ఒక సంఘం పేరిట ఆస్తులు ఉంటే అవి వాటికే చెందుతాయి. అంతేగాని ఆ సొసైటీ ఏర్పాటు చేసిన వ్యక్తులకు గాని లేదా వారి వారసులకు గాని వర్తించవు. కానీ సాలూరులో డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ పేరిట ఉన్న భూములు మాత్రం ఆ సంస్థ స్థాపించే నాటికి పుట్టని వ్యక్తి పేరిట విక్రయించారు.
- సుమారు రూ.ఆరు కోట్ల విలువైన డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ భూములను సొంతం చేసుకోవాలని కొందరు స్కెచ్ వేశారు. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖల సిబ్బంది సహకా రాన్ని తీసుకున్నారు. 1978లో రిజిస్ర్టేషన్ జరిగిన సంస్థ పేరిట ఉన్న భూములను 2025లో తిరిగి రిజిస్ర్టేషన్ చేయించి తమ పనిని సులువుగా కానిచ్చేశారు. సుమారు రెండు ఎకరాల 79 సెంట్ల భూమికి ఈ నెల 16న తహసీల్దార్ వన్బీ ఇచ్చారు. అయితే అదే రోజున యుద్ధప్రాతి పదికన సాగు భూములుగా చూపించి.. స్టాంపు డ్యూటీ తగ్గించి రిజిస్ర్టేషన్లు చేశారు. మొత్తంగా ఈ భూముల రిజిస్ర్టేషన్లలో అక్రమాలు చోటుచేసుకోగా.. కోట్లాది రుపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
- కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ బాధ్యతలను జిల్లా రిజిస్ర్టార్కు అప్పగించారు. దీంతో ఈ నెల 23న సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. భూముల క్రయవిక్రయదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
- ఒకవైపు ఈ విచారణ జరుగుతుండగా జిల్లా రిజిస్ర్టార్ పక్కనే.. ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉండి సూచనలు అందిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ రైటర్స్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఉండకూడదు. కానీ ఏ విధంగా కార్యాలయంలో లోపలకు అనుమతించారో విచారణ అధికారులే స్పష్టం చేయాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.