ఇంటికి నడుచుకుని వెళ్తుండగా..
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:12 AM
లిఫ్ట్ అడిగి ఎక్కిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో స్వగ్రామానికి నడిచివెళ్తున్న అతన్ని వెనుక నుంచి బైకుతో వస్తున్న ఓ యువకుడు బలంగా ఢీకొట్టాడు.
వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఇద్దరి మృతి
జామి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): లిఫ్ట్ అడిగి ఎక్కిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో స్వగ్రామానికి నడిచివెళ్తున్న అతన్ని వెనుక నుంచి బైకుతో వస్తున్న ఓ యువకుడు బలంగా ఢీకొట్టాడు. జామి మండలం లోని జాగరం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందా రు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జాగరం గ్రామానికి చెందిన రావాడ వెంకటరావు(55) జామి పంచాయతీలో చెత్తసేకరించే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తు న్నాడు. ఈయన శుక్రవారం బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి సాయంత్రం 7 గంటల సమయంలో జామి చేరుకున్నాడు. అక్కడి నుంచి స్వగ్రామం జాగరం వెళ్లేందుకు రోడ్డుపై ఉన్న సమయంలో.. ద్విచక్రవాహనంపై వస్తున్న అదే గ్రామా నికి చెందిన సురేష్ను లిఫ్ట్ అడిగి ఎక్కాడు. వీరు వస్తున్న వాహనం గ్రామంలోని విశాఖ డెయిరీ సమీపంలోకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. దీం తో ఇద్దరూ బండిని నడిపించుకుంటూ మాట్లాడుకుంటూ గ్రామంలోకి వస్తున్నా రు. ఇదే సమయంలో జామి గ్రామానికి చెందిన గొర్లె పవన్కుమార్(19) ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వస్తూ.. నడుచుకుంటూ వెళ్తున్న వెంకటరావును బలం గా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటరావుతో పాటు పవన్కుమార్ కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వెంకటరావుకు ముగ్గురు పిల్లలు కాగా, వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య నారెమ్మ ఉన్నారు. వెంకటరావుకు ఇటీవల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. భార్య కూలి పనులకు వెళ్తూ కుటుంబ పోషణలో సహకరిస్తోంది. వెంకటరావు చెత్త సేకరించే వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
జామి గ్రామాని కి చెందిన పవన్కుమార్ విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదు వుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు ఈశ్వరరావు, ఎర్నమ్మలు పని నిమిత్తం విజ యవాడలో ఉంటున్నారు. పవన్కుమార్ను అతని మేనమామ అప్పలనాయుడు వద్ద వదిలి వెళ్లారు. పవన్కుమార్ అక్క భాగ్యలక్ష్మి హైద్రాబాద్లో ఉద్యోగం చేస్తోంది. పవన్కుమార్ పదిరోజుల కిందటే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఆయన జాగరం, అలుగుబిల్లి గ్రామాల్లో ఉన్న తమ పెద్ద మ్మల ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పవన్కుమార్ ఇటీవల అగ్నివీర్కు ఎంపికయ్యాడు. త్వరలో మిగతా పరీక్షలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈమధ్యే స్పోర్ట్స్ బైక్తో తిరుగుతున్నాడని, ఇదే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.