కంటైనర్ను ఎక్కిస్తుండగా..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:02 AM
క్రేన్ సహాయంతో కంటైనర్ను లారీలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు హెచ్టీ వైర్లు తగిలి ముగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు.
మక్కువ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): క్రేన్ సహాయంతో కంటైనర్ను లారీలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు హెచ్టీ వైర్లు తగిలి ముగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు. వారిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలంలోని డెప్పగూడ వద్ద లొద్ద జలపాతానికి నిర్మిస్తున్న రోడ్డు పనులు పూర్తికావడంతో అందుకు సంబంధించిన పరికరాలు, కంటైనర్ను తరలించేందు కు గుర్ల, గంట్యాడ మండలాల నుంచి విద్యుత్ కార్మికులు శుక్రవారం వచ్చారు. వారు క్రేన్ సహాయంతో కంటైనర్ను ఎక్కిస్తుండగా పైన ఉన్నహెచ్టీ లైన్కు సంబంధించిన తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో క్రేన్ డ్రైవర్, విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన మొయిదా ఆనందరావు(46) అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన గంట్యాడ మండలానికి చెందిన కంకణాల ఈశ్వర రావు, సంఘం వెంకటరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ఆనందరావు భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్ పోలీస్స్టేష న్ ఎస్ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేశారు. ఈమేరకు మృతదేహాన్ని సాలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆనందరావుకు భార్య శ్రీదేవితో పాటు సుస్మిత, అనూష, ప్రశాంతి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక ఆడపిల్లకు ఈ మధ్యే వివాహం చేశారు. ఎప్పుడూ నలుగురితో సరదాగా ఉండే ఆనంద్ మృతిచెందడంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు దుఃఖంలో మునిగిపోయారు.