Compensation పరిహారం అందేదెప్పుడో?
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:49 PM
When Will the Compensation Be Provided? గత ఏడాది తుపాను, అధిక వర్షాలతో పంటలు నష్ట పోయిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నేటికీ పరిహారం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సాయంతో కొంతైనా నష్టాల నుంచి బయటప డొచ్చని వారు భావిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా.. ఇంకా ఖాతాల్లో నగదు జమకాకపో వడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.
నేటికీ బ్యాంకు ఖాతాల్లో జమకాని నగదు
ఆశగా ఎదురుచూస్తున్న వైనం
పార్వతీపురం, ఫిబ్రవరి28(ఆంధ్రజ్యోతి): గత ఏడాది తుపాను, అధిక వర్షాలతో పంటలు నష్ట పోయిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నేటికీ పరిహారం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సాయంతో కొంతైనా నష్టాల నుంచి బయటప డొచ్చని వారు భావిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా.. ఇంకా ఖాతాల్లో నగదు జమకాకపో వడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. గత ఏడాది అక్టోబరులో జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు 383 హెక్టార్లలో వరితో పాటు మొక్కజొన్న, పత్తి, అరటి తదితర పంటలను 968 మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వారికి సుమారు రూ.69 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. భామిని మండలంలో 173 మంది, కొమరాడలో 139, పాచిపెంటలో 153 మంది రైతులకు అత్యధికంగా నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఇక గతేడాది అధిక వర్షాల వల్ల జిల్లాలో 1059 మంది రైతులు అరటితో పాటు ఇతరత్రా పంటలను నష్టపోయారు. వారికి సుమారు సుమారు రూ.కోటి 57 లక్షల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. తుపాన్ల కారణంగా 1128 మంది రైతులు 290 హెక్టార్లలో వరి పంటను కోల్పోయిన వారికి రూ.70 లక్షల వరకు పరిహారం అం దించాలని ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ రైతుల ఖాతాల్లో నేటికీ సొమ్ము జమకాలేదు. అప్పట్లో సాలూరు మండలంలో 150 మంది రైతులు 48.37 హెక్టార్లలో, జియ్యమ్మవలసలో 135 మంది రైతులు 27.75 హెక్టార్లలో, భామినిలో 130 మంది 36.55 హెక్టార్లలో, గరుగుబిల్లిలో 155 మంది 28.93 హెక్టార్లలో అత్యధికంగా వరి పంటను కోల్పోయారు. ప్రస్తుతం వారంతా పరిహారం సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై జిల్లా ఉద్యాన శాఖ సాంకేతిక అధికారి క్రాంతిని వివరణ కోరగా.. ‘గతేడాది వర్షాలు, తుపాన్ల కారణంగా ఉద్యాన పంటలను నష్టపోయిన రైతులకు సుమారు రూ.కోటి 57 లక్షలు పరిహారంగా అందించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.’ అని తెలిపారు.