Welfare Schemes సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:21 AM
Welfare Schemes Must Reach the People రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురంలోని ఓ కల్యాణ మండపంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురంలోని ఓ కల్యాణ మండపంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి విస్తృత సమావేశం నిర్వహించనున్నామన్నారు. వచ్చేనెలలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియ జేయాలని సూచించారు. పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో విజయనగరం ఆర్టీసీ రీజియన్ చైర్మన్ డి.దొర , పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి ఈశ్వరి , అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి సురేష్, కమిటీ ప్రతినిధి పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.