పెళ్లింట విషాదం
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:08 AM
పెళ్లింట అందరూ ఆనందంలో ఉన్న తరుణంలో వధువు సోదరుడు మృతిచెందడంతో ఆనందం మాయమై.. విషాదం ఆవహించింది.
రోడ్డు ప్రమాదంలో వధువు తమ్ముడు మృతి
ఇద్దరికి తీవ్ర గాయాలు
గజపతినగరం/దత్తిరాజేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పెళ్లింట అందరూ ఆనందంలో ఉన్న తరుణంలో వధువు సోదరుడు మృతిచెందడంతో ఆనందం మాయమై.. విషాదం ఆవహించింది. పెళ్లి పనుల నిమిత్తం విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా మరుపల్లి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె తమ్ముడు(చిన్నాన్న కొడుకు) రౌతు ధనంజయ్నాయుడు(24)మృతి చెందగా.. పెళ్లి కుమార్తె సొంత తమ్ముడు సాయిశంకర్, కుటుంబ సభ్యుడు గెద్ద శేఖర్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ కిరణ్కుమార్నాయుడు వివరాల మేరకు.. శుక్రవారం జరగనున్న వివాహానికి విజయనగరంలో పెళ్లి ఏర్పాట్లు ముగించుకుని స్వగ్రామం పెదమానాపురం వెళ్తున్న కారు.. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ధనుంజ య్నాయుడు అక్కడికక్కడే మృతిచెందగా.. రౌతు సాయి, శేఖర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృ తుడి తల్లిదండ్రులు రౌతు శ్రీనివాసరావు, సత్యవతులు వ్యవసాయంపై ఆధారప డి జీవనం సాగిస్తున్నారు. మృతుడు బీటెక్ పూర్తి చేయగా, అతడి తమ్ముడు గిరి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా మృత్యు వాత పడడంతో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.