రాత్రంతా తిరుగుతున్నాయ్..
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:21 AM
మండలంలో సంచరిస్తున్న గజరాజులు మూడు గంటల పాటు ట్రాకర్లకు చుక్కలు చూపించాయి.
జియ్యమ్మవలస, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో సంచరిస్తున్న గజరాజులు మూడు గంటల పాటు ట్రాకర్లకు చుక్కలు చూపించాయి. శనివారం రాత్రి చింతలబెలగాం పంచాయతీ రాజయ్యపేట నుంచి పెదమేరంగి, చినమేరంగి గ్రామ సమీపానికి వచ్చి మళ్లీ దిశను మార్చుకున్నాయి. అక్కడి నుంచి పరజపాడు, పెదకుదమ, సింగనాపురం గ్రామాల మీదుగా గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపానికి చేరుకున్నాయి. పెదకుదమ వరకు ఏనుగులను ట్రాక్ చేసిన ట్రాకర్లు కళ్లు గప్పి వారికి కనబడకుండా సింగనా పురం వైపు వెళ్లిపోవడంతో ట్రాకర్లు అప్రమత్తమయ్యారు. ఏనుగుల జాడ కోసం అర్ధరాత్రి చుట్టు పక్కల గ్రామాలను వెతికారు. చివరికి గరుగుబిల్లి మండలం గిజబ సమీపంలో ఆదివారం వేకువ జామున వాటిని గుర్తించా రు. తరువాత మళ్లీ జియ్యమ్మవలస మండలం బాసంగి వైపు వెళ్లాయి. ప్రస్తుతానికి అక్కడే ఉన్నాయి. అయితే ఏనుగుల కదలికలపై నిఘా వేసి ఉంచిన అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.