Villages must become plastic-free. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తయారుకావాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:34 AM
Villages must become plastic-free. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ చీమలపాటి రవికుమార్ ఆకాంక్షించారు. మండలంలోని బైరిపురం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు.
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తయారుకావాలి
ప్రతి వ్యక్తీ ఒక మొక్క నాటాలి
హైకోర్టు జడ్జి జస్టిస్ రవికుమార్
మెరకముడిదాం, జూలై 5(ఆంధ్రజ్యోతి):
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ చీమలపాటి రవికుమార్ ఆకాంక్షించారు. మండలంలోని బైరిపురం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ముందుగా సొంత ఇంటిని సందర్శించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. అనంతరం స్థానిక శ్రీబాదం పెంటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల పట్ల అధికారులు చిత్తశుద్ధితో మెలగాలని సూచించారు. గ్రామానికి హైకోర్టు జడ్జిగా రాలేదని, గ్రామస్థుడిగా వచ్చానని తెలిపారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేయాలని సూచించారు. ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గిస్తే క్యాన్సర్ దూరం అవుతుందని తెలిపారు. ఆక్సిజన్ ప్రతి ఒక్కరికీ అవసరమని, అందుకే ప్రకృతిని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులంతా భవిష్యత్ తరాలకు మొక్కలు అందించాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడాలని, వాతావరణాన్ని కాపాడుకొని ప్రపంచంలో దేశాన్ని ఆదర్శవంతంగా నిర్మించడానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. కలెక్టర్ రామసుందర్రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వర్షపాతం 30 శాతం తక్కువగా ఉందని, కాలుష్యం వల్ల వాతావరణం మార్పులు చెందుతోందని, మొక్కల శాతం తగ్గిపోవడంతో వర్షం తగ్గిందని అన్నారు. అనంతరం గ్రామస్థులు, అధికారులు జడ్జి జస్టిస్ రవికుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి బబిత, ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఈవో మాణిక్యంనాయుడు, డీపీవో మల్లిఖార్జునరావు, చీపురుపల్లి న్యాయాధికారి బుజ్జి, సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవో సుధారాణి, డీడీవో హేమసుందర్రావు, తహసీల్దార్ సులోచనరాణి, ఎంపీడీవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.