విద్యుత్శాఖలో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:26 AM
విద్యుత్ శాఖలో జరు గుతున్న భారీ అవినీతిపై ఆంధ్రజ్యోతి కథనంపై అధికారుల్లో కదలిక తెచ్చింది.
విజయనగరం/ రింగురోడ్డు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో జరు గుతున్న భారీ అవినీతిపై ఆంధ్రజ్యోతి కథనంపై అధికారుల్లో కదలిక తెచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఈనెల 1న ‘విద్యుత్ శాఖలో అక్రమ వెలుగులు’ అనే కథనం ప్రచురితమయ్యింది. విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసి, బిల్ స్టాప్ పేరుతో విద్యుత్శాఖ ఆదాయానికి గండి కొడుతున్న వ్యవహారంపై ఈఈ త్రినాథరావు విచారణ చేయించారు. దీనికి సంబంధించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లా కేంద్రంగా విద్యుత్ శాఖలోని కొందరు సిబ్బంది అక్రమ వ్యాపారానికి తెర లేపారు. ఒక్కో మీటర్ను రూ.పది వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయించి వినియోగదారులకు బిల్స్టాప్ మీటర్లు అమర్చుతున్నారు. ఈ మీటర్లు ఉంటే ఎంత విద్యుత్ వాడినా రీడింగ్ పెరగదు. బిల్లు సున్నా వస్తుంది. ఇలా వందలాది మీటర్లను అక్రమంగా అమర్చి లక్షలాది రూపాయలు ఆర్జించినట్లు ఆంధ్రజ్యోతి సాక్ష్యాదారాలతో బయటపెట్టింది. ఈ వార్తకు సంబంధించి విజిలెన్స్ అధికారులు వెనువెంటనే విచారణ చేపట్టారు. వీరి ప్రాథమిక విచారణ అనంతరం వి.దినేష్(జూనియర్ లైన్మన్, వుడా సెక్షన్, కేఎల్పురం), ఒ.రాంబాబు(లైన్మన్ దాసన్నపేటసెక్షన్) ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు తేలింది. దీంతో ఈఈ త్రినాథరావు వీరిని సస్పెండ్చేశారు. ఈ అక్రమాలపై ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంపై విచారణ కొనసా గుతుందని, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైన ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.