Tribute to the Teacher గురుదేవోభవ
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:41 AM
Tribute to the Teacher ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించింది. జిల్లా నుంచి ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు లెక్చరర్ను సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దుశ్శాలువా కప్పి ప్రశంసాపత్రాలను అందించారు.
రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నుంచి
ఉత్తమ గురువులకు సత్కారం
జిల్లాలోనూ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం
పార్వతీపురం రూరల్/కొమరాడ/వీరఘట్టం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించింది. జిల్లా నుంచి ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు లెక్చరర్ను సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దుశ్శాలువా కప్పి ప్రశంసాపత్రాలను అందించారు. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం విజయకుమార్, వీరఘట్టం మండలం నీలానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూరు సతీష్, కొమరాడ మండలం సీతామాంబపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్గా పనిచేస్తున్న వనజాక్షితో పాటు ఎంఆర్నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ ఉమాశంకర్ అవార్డులు అందుకున్నారు. సీఎం, విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.
జిల్లాలో వేడుకలు
జిల్లాలోని నర్సిపురంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వందమందికి పురస్కారాలతో సత్కరించారు. ఈ వేడుకల్లో పలువురు విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.