గిరిజనుల తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:20 PM
: మండలంలోని మోదుగ పంచాయతీ బంగారుగుడ్డి, కాట్రగుడ్డి గ్రామాల గిరిజనులు తీవ్ర తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
- పనిచేయని రక్షిత పథకాలు
- కొండవాగుల నీరే దిక్కు
పాచిపెంట రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోదుగ పంచాయతీ బంగారుగుడ్డి, కాట్రగుడ్డి గ్రామాల గిరిజనులు తీవ్ర తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో 52 గిరిజన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. తాగునీటి కోసం సమీపంలోని పెద్దగెడ్డ, కొండవాగుల నుంచి నీటిని తెచ్చుకొని వినియోగిస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని గిరిజనులు బూర అప్పారావు, గెమ్మల పోతయ్య, చిన్నయ్య, ఆదెయ్య తదితరులు ఆవేదన చెందుతున్నారు. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులు సమయంలో పైపులైన్లు దెబ్బతినడంతో పాటు రక్షిత మంచినీటి పథకాల విద్యుత్ మోటార్లు కూడా పాడయ్యాయని, దీంతో గత ఆరు నెలలుగా పథకాలు పని చేయడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్య తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.