Tribal Girl Becomes Pregnant గర్భం దాల్చిన గిరిజన బాలిక
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:21 AM
Tribal Girl Becomes Pregnant సీతంపేట ఏజెన్సీలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో నివసిస్తున్న బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సీతంపేట,ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో నివసిస్తున్న బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామంలో ఈనెల 13న పీహెచ్సీ వైద్యసిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఓ బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని సదరు పీహెచ్సీ వైద్యాధికారి ఐటీడీఏ ఇన్చార్జి పీవోతో పాటు డిప్యూటీ డీఎంహెచ్వోకు తెలియజేశారు. ఇన్చార్జి పీవో ఆదేశాల మేరకు వైద్యసిబ్బంది బాలికను మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈనెల 19న డిప్యూటీ డీఎంహెచ్వో కె.విజయపార్వతి పర్యవేక్షణలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యపరీక్షల అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీనిపై ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ను వివరణ కోరగా.. ‘ విషయం నాదృష్టికి వచ్చింది. బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యసేవల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు రెఫర్ చేయించాం’ అని తెలిపారు. కాగా బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీతంపేట ఎస్ఐ వై.అమ్మన్నరావు శనివారం రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిసింది. దీనిపై ఎస్ఐను వివరణ కోరగా.. ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. గతంలో ఈ బాలిక మండలంలోని ఓ గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదువుకుని.. ఇటీవల టీసీ తీసుకుని స్వగ్రామం వెళ్లిపోయినట్లు తెలిసింది.