Share News

Transparent Resurvey పారదర్శకంగా రీసర్వే

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:18 PM

Transparent Resurvey రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒక దశ ముగిసిన తర్వాతే మరో దశ సర్వే చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. దశల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు.

Transparent Resurvey పారదర్శకంగా రీసర్వే
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒక దశ ముగిసిన తర్వాతే మరో దశ సర్వే చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. దశల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వీఆర్‌వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న రీసర్వేలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భూ యజమానుల హక్కుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని జేసీ తెలిపారు. ఈ మేరకు మూడు దశల్లో నోటీసులు సమయం, డీఎల్‌ఆర్‌ స్థాయి, ఈకేవైసీని తప్పనిసరి చేశామని వ్లెడించారు. 95 శాతం వరకు ఈకేవైసీ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై కేవలం ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాలు మాత్రమే జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌కు వస్తాయన్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా గడువులోగా నోటీసులను జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి వీఆర్‌వో రోజుకు కనీసం 50 ఖాతాలను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో పరిష్కరించాలి..

సీతానగరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి వచ్చిన రెవెన్యూ అర్జీలను పరిశీలించి.. సకాలంలో పరిష్కార మార్గం చూపాలని జేసీ ఆదేశించారు. పెదభోగిలి, బూర్జ సచివాల యాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్‌ బియ్యం పంపిణీపై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రసన్నకుమార్‌, ఎంపీడీవో ప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:18 PM