ట్రాఫిక్ కష్టాలు
ABN , Publish Date - May 03 , 2026 | 12:07 AM
పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి దీప్తి లాడ్జి కూడలి వరకు ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ కష్టాలతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
- పట్టణంలో భారీ వాహనాల రాకపోకలు
- వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు
పార్వతీపురంటౌన్, మే 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి దీప్తి లాడ్జి కూడలి వరకు ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ కష్టాలతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా భారీ వాహనాలు ఆగిపోవడంతో చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారికి ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, కార్లు ఇతర వాహనాలు ఆగిపోయాయి. ఒకపక్క ట్రాఫిక్ మరోపక్క ఎండతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదచారులైతే నరకం చూశారు. ప్రతిరోజూ భారీ వాహనాల రాకపోకలు సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని పాదచారులు, వాహనచోదకులు కోరుతున్నారు.