నేడు శ్రీరామనవమి
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:40 PM
శ్రీరామ నవమి వేడుకలకు జిల్లాలోని రామాలయాలు ముస్తాబయ్యాయి.
- సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
- విద్యుత్ వెలుగుల్లో ఆలయాలు
పార్వతీపురంటౌన్/పాలకొండ/సాలూరురూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి వేడుకలకు జిల్లాలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. అన్ని మండలాల్లోని రామాలయాల్లో శుక్రవారం జరిగే సీతారాముల కల్యాణోత్సవం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం పాతబస్టాండ్ కూడలి సమీపంలోని 250 ఏళ్ల చరిత్ర గల సీతారామస్వామి ఆలయంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరగనుంది. ప్రత్యేక పూజలు, అర్చనలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాలూరు మండలం పెదకోమటిపేట రామాలయంలో గురువారం కొట్నాల ఉత్సవం (సుగంధ ద్రవ్యాలను దంచుట) వైభవంగా నిర్వహించారు. అనంతరం సీతారాములకు సుగంధ ద్రవ్యాలతో మంగళస్నానం జరిపించి పట్టువస్త్రాలను సమర్పించారు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్కేరాజపురంలో సీతారామలక్ష్మణ హనుమాన్ సమేత గణనాథ, షిర్డీసాయినాథ, ఉమారామలింగేశ్వ దేవాలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవం అర్చకులు ఆర్లపూడి కూర్మనాథశర్మ, కిషాన్కుమార్శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శనివారం పట్టాభిషేకం, హోమం జరిపించనున్నారు.