నేడే జెండా పండగ
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:30 PM
జెండా పండగకు సర్వం సిద్ధమైంది. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- ముస్తాబైన పోలీసు పరేడ్ గ్రౌండ్
- సిద్ధమైన ప్రభుత్వ శాఖల శకటాలు
- పతాకావిష్కరణ చేయనున్న మంత్రి శ్రీనివాస్
-350 మందికి ప్రశంసాపత్రాలు
విజయనగరం, ఆగస్టు 14 ( ఆంధ్రజ్యోతి): జెండా పండగకు సర్వం సిద్ధమైంది. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ జెండాను రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎగురవేయనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ పనితీరును తెలిపేలా శకటాలను ప్రదర్శించనున్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉత్తమసేవలందించిన 350 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సన్మానించనున్నారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించనున్నారు. అలాగే పలు విభాగాలకు చెందిన స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు త్రివర్ణ విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏఎస్పీ సౌమ్యలత, డీఆర్వో సత్తిబాబు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆర్డీవో సుధాసాగర్ శుక్రవారం రాత్రి పరిశీలించారు .