మా పొలాలకు వెళ్లేందుకు దారిలేదు
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:51 AM
తమ పొలాలకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నామని భోగాపురం మండలం గూడెపువలస, సవరవిల్లి, ఏ.రావివలస గ్రామాలకు చెందిన రైతులు అందోళన వ్యక్తం చేశారు.
కలెక్టర్కు విన్నంచుకున్న బోగాపురం రైతులు
విజయనగరం, కలెక్టరేట్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): తమ పొలాలకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నామని భోగాపురం మండలం గూడెపువలస, సవరవిల్లి, ఏ.రావివలస గ్రామాలకు చెందిన రైతులు అందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వారు తమ సమస్యను కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లారు. రైతులు మాట్లాడుతూ భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కోసం చాలామంది భూములు ఇచ్చామని, మిగిలిన భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఆ భూములకు వెళ్లడానికి దారిలేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. గతంలో ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రోడ్డు పైనుంచి తమ పొలాలు కనిపిస్తున్నాయి కానీ, అక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సర్వీసు రోడ్డు కూడా లేదని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించిన తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.