Share News

మద్దతు ధర అరకొరే!

ABN , Publish Date - May 15 , 2026 | 12:01 AM

ఈ ఖరీఫ్‌ సీజన్‌కు (2026-27) సంబంధించి రైతులు పండించే వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది.

మద్దతు ధర అరకొరే!

- వరి క్వింటాకు రూ.72 పెంపు

- 80 కేజీల బస్తా రూ.1,952

- మొక్కజొన్నపై రూ.10, పెసరపై రూ.12 పెరుగుదల

- రైతులు తీవ్ర అసంతృప్తి

పాలకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్‌ సీజన్‌కు (2026-27) సంబంధించి రైతులు పండించే వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. అయితే, మద్దతు ధర అరకొరగా ఉండడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా వరి గ్రేడ్‌-1 రకం రూ.2,461, కామన్‌ రకం రూ.2,441గా నిర్ణయించింది. గత ఏడాది గ్రేడ్‌-1 రకం రూ.2,389, కామన్‌ రకం రూ.2,369 ఉండేది. ఈ ఖరీఫ్‌లో క్వింటాకు రూ.72 మద్దతు ధరను పెంచడంతో రూ.2,461 అయింది. దీని ప్రకారం 80కేజీల ధాన్యం బస్తా రూ.1,952 పలకనుంది. అదే విధంగా క్వింటా మొక్కజొన్నకు రూ.10, పెసరకు రూ.12 నామమాత్రంగానే పెంచారు. కందులకు రూ.450, మినుములకు రూ.400, పత్తికి రూ.567 మద్దతు పెరిగింది. కేవలం కంటితుడుపు చర్యగానే ధరలు పెంచినట్టు రైతులు పేర్కొంటున్నారు. మన్యం జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులను ఆశ్రయించి పంటలను అమ్ముకోవాల్సి వస్తుందని రైతాంగం నిట్టూరుస్తుంది. సాగుకు అవుతున్న ఖర్చులకు, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు పొంతన ఉండడం లేదు. ప్రతిఏటా రెండుసార్లు ఎరువులు, పురుగు మందులు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూలి రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ పనులకు వచ్చేవారి సంఖ్య తగ్గడంతో కూలీల డిమాండ్‌ చేసిన డబ్బులను రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలు, పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గణనీయంగా పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు నుంచి రైతాంగం కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి లాభసాటిగా లేదని అంతా పేర్కొంటున్నారు. రోజురోజుకూ వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర మరింత ప్రకటించాలని రైతాంగం పేర్కొంటుంది.

మూడేళ్లలో ప్రధాన పంటల మద్దతు ధరలు (క్వింటాకు)

సంవత్సరం పంట మద్దతు ధర

2024-25 వరి (సాధారణం) రూ.2,300

గేడ్‌-ఏ రకం రూ.2,320

పత్తి రూ.7,521

మొక్కజొన్న రూ.2,225

కందులు రూ.7,550

మినుమలు రూ.7,400

పెసర రూ.8,682

2025-26 వరి (సాధారణం) రూ.2,369

గేడ్‌-ఏ రకం రూ.2,389

పత్తి రూ.8,110

మొక్కజొన్న రూ.2,400

కందులు రూ.8,000

మినుమలు రూ.7,800

పెసర రూ.8,768

2026-27 వరి (సాధారణం) రూ.2,441

గేడ్‌-ఏ రకం రూ.2,461

పత్తి రూ.8,667

మొక్కజొన్న రూ.2,410

కందులు రూ.8,450

మినుమలు రూ.8,200

పెసర రూ.8,780

Updated Date - May 15 , 2026 | 12:02 AM