The rising sun ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:20 AM
The rising sun జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. వారంరోజుల నుంచి పగటిపూట 30 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా క్రమేణా తగ్గుతోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
ఠారెత్తిస్తున్న ఎండలు
- ఉదయం పది గంటల తర్వాత నిర్మానుష్యంగా రోడ్లు
- జిల్లాలో క్రమేణా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
విజయనగరం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. వారంరోజుల నుంచి పగటిపూట 30 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా క్రమేణా తగ్గుతోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పది గంటల తర్వాత ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, ఎస్.కోట తదితర పట్టణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడంలేదు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి తొలి వారంలోనే సగటు 35 డిగ్రీలు నమోదవుతుండడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చిరు, తోపుడుబళ్ల వ్యాపారులు ఎండతీవ్రత వల్ల పది గంటలకే వ్యాపారాలు మూసేసి ఇళ్లకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కూల్డ్రింక్స్, సరబత్లు, పండ్ల, చెరుకు రసాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఏసీలు, కూలర్లు ఎక్కువవాడుతుండడంతో విద్యుత్ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది.
రాత్రి పూట ఉష్ణోగతలు..
ఐదు రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈనెల ఒకటి, రెండు తేదీల్లో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల వరకు నమోదైంది. ఈనెల 15లోగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చునని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు..
తేదీ గరిష్ట (డిగ్రీలలో) కనిష్ట (డిగ్రీలలో)
ఫిబ్రవరి 26 31.0 23.0
ఫిబ్రవరి 27 31.0 22.0
ఫిబ్రవరి 28 32.0 22.0
మార్చి 1 33.0 22.0
మార్చి 2 36.0 21.0