Share News

మన్యం చేరిన కుంకీలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:47 AM

ఎట్టకేలకు జిల్లాకు కుంకీలు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రత్యేక వాహనాల్లో జయంత్‌, అభిమన్యు అనే రెండు కుంకీలు ఇక్కడకు తీసుకొచ్చారు. గుచ్చిమి రిజర్వ్‌ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ జోన్‌కు తరలిం చారు.

 మన్యం చేరిన కుంకీలు
గుచ్చిమి ఫారెస్ట్‌లో ఎలిఫెంట్‌ జోన్‌కు చేరుకుంటున్న కుంకీలు

  • జయంత్‌, అభిమన్యుకు ఘన స్వాగతం

  • గుచ్చిమి ఎలిఫెంట్‌ జోన్‌కు తరలింపు

  • వాటి సాయంతో జిల్లాలో గజరాజుల కట్టడికి చర్యలు

  • మరో పది రోజుల్లో ఆపరేషన్‌ ప్రారంభం: డీఎఫ్‌వో

పార్వతీపురం/సీతానగరం, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు జిల్లాకు కుంకీలు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రత్యేక వాహనాల్లో జయంత్‌, అభిమన్యు అనే రెండు కుంకీలు ఇక్కడకు తీసుకొచ్చారు. గుచ్చిమి రిజర్వ్‌ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ జోన్‌కు తరలిం చారు. తొలుత వాటికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఐకేవీ రాజు మాట్లాడుతూ.. కుంకీల సాయంతో మన్యం జిల్లాలో సంచరిస్తున్న 12 గజరాజులను కట్టడి చేసి ఎలిఫెంట్‌ జోన్‌ను తరలిస్తామన్నారు. ఏనుగుల గుంపు నుంచి ఆస్తి, పంట, ప్రాణ నష్టాలను నివారించేందుకు కుంకీలను ఉపయోగిం చనునున్నామని తెలిపారు. గజరాజుల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతుల బాధలను ప్రభుత్వం గుర్తించి వెంటనే స్పందించిందని ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక చొరవతో రెండు కుంకీలు జిల్లాకు చేరుకున్నాయన్నారు. డీఎఫ్‌వో ప్రసూన మాట్లాడుతూ.. ఈ నెల 29న కుంకీ ఏనుగుల సేవలను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. వాటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెరకు గడలు, పనసకాయలు, అరటి పండ్లు, తదితర సీజనల్‌ పండ్లతో ప్రత్యేక ఆహారం అందిస్తామని వివరించారు. కుంకీ ఏనుగులకు అవసరమైన వైద్య పరీక్షలు, విశ్రాంతి, శిక్షణ కోసం ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్న అటవీ ఏనుగులను కుంకీలతో సాయంతో నియంత్రించి.. సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తామని చెప్పారు. దీంతో జిల్లావాసులకు గజరాజుల బెడద తప్పుతుందన్నారు. రానున్న రోజుల్లో ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆస్తి, పంటలతో పాటు ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో ఆపరేషన్‌ ప్రారంభిస్తామని చెప్పారు. కుంకీలు ఉన్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఏదేమైనా కుంకీల రాకతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్య ఇక పరిష్కారం కానుందని భావిస్తున్నారు.

బాడంగి మండలంలోనే ఏనుగుల తిష్ఠ

బాడంగి, జూలై 25(ఆంధ్రజ్యోతి): పినపెంకి, రేజేరు, కోటిపల్లి, వాడాడ, ఆకులకట్ట, గూడెపువలస తదితర ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి తిరిగిన ఏనుగులు శనివారం గూడెపువలస నుంచి కోటిపల్లి, ఆనవరం, బొత్సవానివలస మీదుగా పాల్తెరు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో పాల్తేరు, భీమవరం, ముగడ గ్రామాలతోపాటు బొబ్బిలి మండలమైన కారాడ, అలజంగి, పెంట గ్రామస్థులు కూడా ఏ క్షణమైనా తమ వైపు ఏనుగుల గుంపు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖాధికారి గణేష్‌ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో వీటిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు వాటి దగ్గరకు వెళ్లరాదని కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 12:47 AM