That ITI is great once up on a time ఆ ఐటీఐ అ‘పూర్వం’
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:24 AM
That ITI is 'unique' బొబ్బిలి ఐటీఐ అంటే జిల్లాకే ప్రత్యేకంగా ఉండేది. 30 మంది బోధకులు.. వందలాది మంది విద్యార్థులు.. వారికి సర్వ సౌకర్యాలు.. బయటకు వెళ్లిన వెంటనే ఉద్యోగాలు ఇలా అన్నింటా ఆదర్శంగా ఉండేది.
ఆ ఐటీఐ అ‘పూర్వం’
అర్ధశతాబ్దికి పైగా చరిత్ర కలిగిన బొబ్బిలి ఐటీఐ
రోజురోజుకూ తగ్గుతున్న ప్రాభవం
30 మంది బోధకులకు నేడు ముగ్గురే
సౌకర్యాలు అంతంతే
పీఎం సేతు పథకంపై చిగురిస్తున్న ఆశలు
బొబ్బిలి ఐటీఐ అంటే జిల్లాకే ప్రత్యేకంగా ఉండేది. 30 మంది బోధకులు.. వందలాది మంది విద్యార్థులు.. వారికి సర్వ సౌకర్యాలు.. బయటకు వెళ్లిన వెంటనే ఉద్యోగాలు ఇలా అన్నింటా ఆదర్శంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఐటీఐలో సీటుకు చాలా డిమాండ్ ఉండేది. ఎమ్మెల్యేలు, మంత్రులతో రికమండేషన్ చేయించేవారు. ఆ కళ నేడు చెదిరింది. కోర్సులు తగ్గిపోయాయి. ఉపాధ్యాయులు అంతంతమాత్రంగా ఉన్నారు. సౌకర్యాలు దయనీయం. పీఎం సేతు పథకంతో అయినా పూర్వవైభవం వస్తుందేమో చూడాలి.
బొబ్బిలి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
చారిత్రాత్మకమైన పట్టణంగా పేరొందిన బొబ్బిలిలో 1963లో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ (ఐటీఐ) ఏర్పాటైంది. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఫిట్టరు, ఎలక్రీషియన్, టర్నర్, మెషినిస్టు, మోటారు మెకానిక్, డ్రాఫ్ట్సుమెన్ మెకానికల్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడులు 24 ఉండేవి. ఇందులో డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడులు ఏడాది కోర్సులు కాగా మిగిలినవన్నీ రెండేళ్ల కోర్సులు. ఎన్సీవీటీ ఎఫిలియేటెడ్తో ఈ ట్రేడులను నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్మెన్ సివిల్, రేడియో అండ్ టీవీ మెకానిజమ్ వంటి కోర్సులకు ఆదరణ లేకపోవడంతో వాటిని ఎత్తివేశారు. లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్, ప్లంబింగ్, కంప్యూటర్ కోర్సులు, వైరింగ్, వంటి వాటిలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బొబ్బిలి ఐటీఐ ప్రారంభమైన తొలినాళ్లలో ఇక్కడ సీటు కోసం చాలా డిమాండ్గా ఉండేది. బొత్స ఝాన్సీలక్ష్మి ఎంపీగా ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను సుమారు కోటి రూపాయలతో మంజూరు చేయించారు. ఆ యంత్రాలేవీ పనిచేయడం లేదు. ఈ ఐటీఐని ఆధునీకరించేందుకు గతంలో ప్రిన్సిపాల్గా ప్రస్తుత జిల్లా కన్వీనరుగా ఉన్న టీవీ గిరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వర్కుషాపులను విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఆవరణంలో పరిశుభ్రతకు పెద్ద పీట వేశారు. ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని యోచించారు. కాని అనతికాలంలోనే ఆయన బదిలీపై వెళ్లిపోవాల్సి వచ్చింది.
అరకొర సిబ్బందితో..
ఐటిఐలో ప్రిన్సిపాల్, నలుగురు ట్రైనింగ్ అధికారులు, 30 మంది ఇన్స్ట్రక్టర్లు ఉండాలి. ప్రిన్సిపాల్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. కేవలం ముగ్గురు ఇన్స్ట్రక్టర్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. 8 ట్రేడులలో సుమారు 500 మంది విద్యార్థులు ఏటా శిక్షణ పొందుతున్నారు. 2015 నుంచి ఉద్యోగాల నియామకం జరగలేదు. ఉన్న కొద్దిపాటి మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఐదుగురు సీనియర్ అసిస్టెంట్స్కు గాను ఒకరు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు గాను ముగ్గురే పనిచేస్తున్నారు. సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. క్లాస్ఫోర్ ఉద్యోగులు పదిమందికి గాను 8 మంది పనిచేస్తున్నారు.
పీఎం సేతు పథకంతోనైనా..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం సేతు (పీఎం స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటిఐలు)పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రభుత్వ ఐటిఐల రూపురేఖలను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇందుకోసం వంద ఐటీఐలను ఎంపిక చేసింది. ఐదేళ్ల ప్రాజెక్టు కింద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఐటిఐలను అభివృద్ధి చేయనుంది.
స్పోక్ ఐటీఐగా అభివృద్ధికి అవకాశం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐని హబ్గా ఏర్పాటు చేసి దాని పరిధిలో బొబ్బిలి, రాజాం, సాలూరు భద్రగిరి ఐటిఐలను స్పోక్లుగా మార్చే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం 241 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో స్పోక్ ఐటిఐకి రూ.40 కోట్లు, హబ్ ఐటిఐకి రూ.80 కోట్లు చొప్పున కేటాయించనున్నారు. మూడు ప్రైవేట్ పరిశ్రమలను గుర్తించి వాటి ద్వారా బిడ్లను ఆహ్వానించనున్నారు. విశాఖ ఓల్డ్ ఐటిఐ, నరవ, విశాఖ గర్ల్స్ ఐటిఐలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐలకు పీఎం సేతు పథకం వర్తింపజేసేందుకు డీఆర్సీ సమావేశంలో చర్చించి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీకి పంపారు.
పీఎం సేతు అమలుకు సన్నాహాలు
టీవీ గిరి, జిల్లా ఐటిఐల కన్వీనర్
పీఎం సేతు పథకాన్ని జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలకు వర్తింపజేసేందుకు ఓ ప్రతిపాదన ఉంది. ఇంకా కార్యరూపం దాల్చలేదు. జిల్లా ఐటీఐని హబ్గా, ఇతర ఐటీఐలను స్పోక్స్లుగా చేసి అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఓ యాంకర్ పరిశ్రమను నిర్ణయించాలి. మూడు పరిశ్రమలను ఎంపిక చేసి గుర్తిస్తే వాటి నుంచి బిడ్లను ఆహ్వానిస్తారు. ఇదంతా ఉన్నతాధికారుల సాఽ్ధయిలో జరగాల్సి ఉంది. ఈ పథకం అమలైతే ఐటీఐలను పట్టిపీడిస్తున్న నిధులు, వసతులు, సిబ్బంది, వనరుల సమస్య తీరిపోతుంది. ఐటీఐలు కళకళలాడడం ఖాయం.